– కాకుండా అడ్డుకునేందుకు ఒక వర్గం ఎత్తులు
– ఎంపీ అర్వింద్ కుమార్ నుంచి గట్టి పోటీ
– రేసులో పాయల్ శంకర్, రామచందర్రావు
– నేడు నోటిఫికేషన్..ఎల్లుండి నామినేషన్లు
– ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రకటన
– నేడు రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్షా ప్రత్యేక భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎంపీ ఈటల రాజేందర్కు కట్టబెట్టేందుకు మొగ్గుచూపుతున్నది. ఆర్థిక, సామాజిక అంశాలను బేరీజు వేసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, డి.అర్వింద్ కుమార్ ఆయనకు బలమైన పోటీదారుగా మారినట్టు తెలుస్తోంది. రేసులో మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, డిప్యూటీ ప్లోర్ లీడర్ పాయల్ శంకర్ పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంలో మధ్యే మార్గంగా ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరును పాత కాపులంతా తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. ఆయనేమో కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరించేందుకు సున్నితంగా నో చెప్పినట్టు వినికిడి. అయితే, అంతిమంగా బీసీకే అధ్యక్ష పదవి దక్కనున్నట్టు తెలిసింది. మరోవైపు అధ్యక్ష ఎన్నిక కోసం ఆదివారం జాతీయ నాయకత్వం నోటిఫికేషన్ విడుదల చేసే సూచనలున్నాయి. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారనీ, వీలైతే జులై తొలివారంలో కొత్త అధ్యక్షున్ని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా నిజామాబాద్ రానున్నారు. తిరిగి వెళ్లే సమయంలో ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యనేతలతో ఆయన భేటీకానున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో అమిత్ పర్యటనలో కొత్తదళపతి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో ఆశావాహుల పేర్లు మరోమారు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో బలమైన ముదిరాజ్ సామాజిక తరగతికి చెందిన, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. బీజేపీకి ఇప్పటికే ఉన్న ఓటుబ్యాంకు ఎలాగూ ఉంటుంది…ఈటలకు ఇస్తే బీసీ సామాజిక తరగతుల వారు, తెలంగాణ ఉద్యమ కారులు పార్టీవైపు మొగ్గుచూపుతారనే ఆశలో అధిష్టానం ఉంది. వామపక్ష నేపథ్యం నుంచి ఆయన నియామకం సరిగాదనే పల్లవిని పలువురు నేతలు అధిష్టానం వద్ద బలంగా వినిపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఆయన అధ్యక్షుడు అయితే, పార్టీలో తమ పాత్ర పరిమితమవుతుందనే భావనలో కొందరు సీనియర్లు పనిగట్టుకుని ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వారంతా ఉత్తర తెలంగాణలో బలమైన సామాజిక తరగతిగా ఉన్న మున్నూరు కాపునకు చెందిన ఎంపీ అర్వింద్కుమార్ను, ఆయన్ను కాదంటే మధ్యే మార్గం డాక్టర్ ఎంపీ కె.లక్ష్మణ్ను ప్రతిపాదించినట్టు వినికిడి. అయితే, లక్ష్మణ్ దీనికి సుముఖంగా లేడని తెలిసింది. ఆయన కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వీరేగాక, బీజేపీ ఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేర్లు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మహిళా కోటా కింద అధ్యక్ష పదవిని ఇస్తే డీకే అరుణకు కూడా అవకాశముంది. అంతిమంగా స్థానిక సంస్థలకు కొత్త అధ్యక్షునితోనే వెళ్లే యోచనకు అధిష్టానం వచ్చి త్వరగా తేల్చేందుకు కసరత్తు చేస్తున్నది.
నేడు నిజామాబాద్కు అమిత్షా
కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్కు రానున్నారు. అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత నిజామాబాద్ కంఠేశ్వరం క్రాస్ రోడ్లో ఏర్పాటుచేసిన మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత వీలును బట్టి నిజామాబాద్లోగానీ, హైదరాబాద్లోగానీ రాష్ట్ర ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుని నియామకం, జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.