– అడ్డదారులు తొక్కుతున్న కళాశాలల యాజమాన్యాలు
– లంచాలు మరిగి తప్పుడు నివేదికలు ఇస్తున్న తనిఖీ బృందాలు
– మోసపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
– సిబ్బంది, ప్రమాణాలు, వసతులను పరిశీలించాలని విద్యావేత్తల సూచన
నాక్ రేటింగ్స్ కోసం ఉన్నత విద్యా సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అర్హతలు కలిగిన బోధనా సిబ్బంది లేకపోయినా… మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా…ప్రమాణాలు పాటించకపోయినా… తనిఖీలకు వచ్చే అధికారుల బృందానికి ముడుపులు చెల్లించి మంచి రేటింగ్స్ పొందుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. నాక్ ఏ, ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్స్ వచ్చాయంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇచ్చి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం గమనార్హం. విద్యావేత్తలతో కూడిన తనిఖీ బృందాలు సైతం డబ్బు కోసం గడ్డి కరుస్తూ విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఇలాంటి అక్రమాలకు పాల్పడి, గుట్టు రట్టవడంతో విచారణలు ఎదుర్కొంటున్నాయి.
న్యూఢిల్లీ : రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో కొత్తగా నియమితుడైన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ను ప్రిన్సిపాల్ తన గదికి పిలిపించారు. ఆయన చేతిలో ఓ కవరు పెట్టారు. అందులో ఐదు లక్షల రూపాయల నగదు ఉంది. కళాశాలకు తనిఖీ నిమిత్తం వచ్చే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) సభ్యులకు ఆ కవరును అందజేయాలని ఆదేశించారు. దీంతో కమిటీ సభ్యులు బస చేసిన ఐదు నక్షత్రాల హోటల్కు చేరుకున్న రాఘవ్ ఆ కవరును, దానితో పాటు ఓ పూల బొకేను వారి చేతిలో పెట్టారు. మరో ఐదు లక్షల రూపాయల విలువైన బహుమతులు కూడా అందజేశారు. కవరును తెరిచి చూసిన కమిటీ సభ్యులు కొంత అసంతృప్తికి గురయ్యారు. ప్రిన్సి పాల్ స్వయంగా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వసతులు, సిబ్బంది లేకపో యినా కాలేజీకి మంచి గ్రేడింగ్ ఇచ్చామని చెప్పారు. చివరికి హోటల్ నుంచి వెళ్లిపోతూ బట్లర్కు ఓ ఐదు వందల రూపాయల టిప్ ఇవ్వమని సూచించడంతో రాఘవ్ అవాక్కయ్యాడు.
సాలెగూడులో చిక్కిన శలభమే
వాస్తవానికి నాక్ బృందం తనిఖీకి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే కళాశాలలకు పంపుతుంది. లోపాలు ఏవైనా ఉంటే ఆ సమయంలో సరిచేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని కళాశాలలు అక్రమాలకు తెర తీస్తాయి. తనిఖీ బృందానికి తప్పుడు నివేదికలు అందజేస్తాయి. కళాశాలలో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు పత్రాలు సృష్టిస్తాయి. లేనివి ఉన్నట్టు భ్రమ కల్పిస్తాయి. అప్పటికప్పుడు అధ్యాపకులను పట్టుకొచ్చి సిబ్బందిగా చూపుతాయి. ఈ తప్పులన్నీ మాఫీ కావాలంటే నాక్ బృందానికి పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. లంచాలు మరిగిన నాక్ బృందం గుడ్డిగా ఫైల్స్పై సంతకాలు పెట్టేస్తుంది. కళాశాల తీరు అధ్వానంగా ఉన్నప్పటికీ మంచి గ్రేడింగ్ ఇచ్చి సంతృప్తి పరుస్తుంది. ఈ గ్రేడింగ్లను చూపి కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. నాక్ గ్రేడింగ్ను చూసి వారంతా ఉబ్బితబ్బిబై లక్షలాది రూపాయల డొనేషన్ కట్టి అడ్మిషన్ తీసుకుంటారు. చేరాక కానీ అసలు బండారం బయటపడదు. కానీ అప్పటికి చేసేదేమీ ఉండదు. ఒకసారి కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థి సాలెగూడులో చిక్కుకున్నట్లు విలవిలలాడాల్సిందే. వేరే కళాశాలకు మారడం కుదరదు.
మార్కెటింగ్ కోసమే గ్రేడింగ్స్
ఉన్నత విద్యా సంస్థలలో ప్రమాణాలు, వసతులు సరిగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించేందుకు 1994లో నాక్ను ఏర్పాటు చేశారు. ఇది ఓ స్వతంత్ర సంస్థ. యూజీసీ నిధులతో నడుస్తోంది. బెంగళూరులో దీని కేంద్ర కార్యాలయం ఉంది. విద్యా సంస్థలు నాక్ గ్రేడింగ్ పొందడం ఐచ్ఛికమే. అవి తమ సమాచారాన్ని కౌన్సిల్ పోర్టల్లో అప్లోడ్ చేసి అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రెండు బ్యాచ్లను పూర్తి చేసుకున్న లేదా ఆరు సంవత్సరాలు మనుగడలో ఉన్న విద్యా సంస్థలు నాక్ గ్రేడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంస్థల మధ్య ఇటీవలి కాలంలో పోటీ పెరుగుతుండడంతో
అవి అడ్డదారులు తొక్కుతూ తనిఖీ బృందాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి మంచి గ్రేడింగ్స్ పొందుతున్నాయి. గత రెండు దశాబ్దాలలో ప్రయివేట్ విద్యా సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. గతంలోనూ అవినీతి జరిగేది కానీ గత ఎనిమిది సంవత్సరాలలో యాజమాన్యాలు మరీ బరి తెగించాయి. ఇవాళ ఏ విద్యా సంస్థ వెబ్సైట్ చూసినా దాని పేరు కింద నాక్ గ్రేడ్ ఉంటోంది. మార్కెటింగ్కు ఇది తప్పనిసరి అవుతోందని గతంలో నాక్ కమిటీలపై ఛైర్పర్సన్గా పనిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్ జవహర్ నేసన్ వ్యాఖ్యానించారు. ఎంత మంచి గ్రేడింగ్ ఉంటే అంతగా విద్యార్థులు చేరుతున్నారని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు కూడా ఏ లేదా ఏ ప్లస్ లేదా ఎ ప్లస్ ప్లస్ ఉన్న సంస్థలనే ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. నాక్ గ్రేడింగ్ ఆధారంగా విద్యా శాఖ గ్రాంట్లు, నిధులు అందజేస్తోంది. ఏ, ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ కలిగిన సంస్థలను కేటగిరీ-1గా పరిగణించి నిధుల విషయంలో ప్రాధాన్యత ఇస్తారు. దీంతో అనేక సంస్థలు ఆ గ్రేడ్ల కోసం అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నాయి. నాక్ తనిఖీల వ్యవహారంలో కొందరు మధ్యవర్తులు తలదూరుస్తారు. వీరు కళాశాలల యాజమాన్యాలను సంప్రదించి మంచి గ్రేడింగ్ ఇప్పిస్తామని చెబుతారు. వాటితో బేరం కుదుర్చుకుంటారు. ఈ మధ్యవర్తులలో కొందరు గతంలో నాక్ తరఫున పనిచేసిన వారే. కేవలం నాక్ గ్రేడింగ్స్ చూసి మోసపోయి విద్యార్థులను కళాశాలలలో చేర్చవద్దని, అక్కడి అధ్యాపకుల అర్హతలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకోవాలని విద్యావేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే
ఈ అవినీతి, అక్రమాల బాగోతం చాలా కాలంగా జరుగుతున్నదే. ఇటీవలి కాలంలో అవి బాగా వెలుగు చూస్తున్నాయి. ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు నాక్ తనిఖీ బృందంలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు జేఎన్యూ, దేవనాగరి యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ సహా వేర్వేరు విద్యా సంస్థలలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు అనుకూలంగా మంచి గ్రేడింగ్ ఇచ్చేందుకు వీరు ముడుపులు స్వీకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇరవై ప్రదేశాలలో దాడులు నిర్వహించి రూ.37 లక్షల నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుంది. దీంతో నిద్ర లేచిన నాక్ 900 మందిని విధుల నుంచి తొలగించింది. ‘విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినందుకు’ వీరిపై వేటు వేసినట్టు వివరణ ఇచ్చింది. ఆ తర్వాత… వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నాక్ అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే దీనిపై కొందరు విద్యావేత్తలు పెదవి విరిచారు. అవినీతికి పాల్పడి పట్టుబడిన వారిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం లేదని, వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు. అరెస్టులు, విచారణలు నాక్ తనిఖీ బృందానికే పరిమితం చేయడం ఓ పెద్ద జోక్ అని, మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని కోరారు.
నాక్ గ్రేడింగుల మాయాజాలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES