డిఎస్ ఆర్ రిపోర్టు చేయని పంచాయతీ కార్యదర్శులు..
నవతెలంగాణ – అచ్చంపేట : గత 16 నెలలుగా గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు నిలపదలా చేసింది. పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిధులు నిలుపుదల కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామ పంచయతీలలో పన్నుల రూపంలో వసులైన నిధులను వాడుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి నిర్వహణ చేస్తున్నట్లు కొందరు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతూ పంచాయతీలలో నిర్వహిస్తుంటే మళ్ళీ ప్రభుత్వం డిఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్ ) యాప్ తలనొప్పిగా మారిందని కార్యదర్శులు మండిపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల లోపు ఫేస్ (ముఖం) గుర్తింపుతో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రోజువారిగా ఇతర వివరాలతో పాటు పనుల వివరాల ఫోటోలను యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు ఎన్ని నివాస గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారు. నమోదు చేయవలసి ఉంటుంది. తడి పొడి చెత్త వివరాలను ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా యాప్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిఎస్ఆర్ యాప్ లో డైలీ శానిటేషన్ రిపోర్టు పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయడం లేదు.
గ్రామపంచాయతీ నిర్వహణ, పారిశుద్ధ్య( డ్రైనేజీ) నిర్వహణ, స్మశాన వాటిక, గ్రామస్తులకు ట్రేడ్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఇతర పలు రకాల పనులను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలంటే గ్రామపంచాయతీలలో కంప్యూటర్ సౌకర్యం లేదు. ప్రతి విషయానికి మండల పరిషత్ లో కంప్యూటర్ ఆపరేటర్ పై ఆధారపడి ఉంటున్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వివిధ శాఖలకు చెందిన అధికారులను స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వీరు పేరుకే పరిమితమయ్యారు. మా శాఖ పనులే మాకు చాలా ఉన్నాయి. మీరు గ్రామపంచాయతీ కార్యదర్శులు కదా… మీరే మీ పనులు చేసుకోండి అని చెబుతున్నట్లు కొందరు గ్రామపంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారు.
ఇప్పటికే 30కి పైగా పనుల భారంతో అవస్థలు పడుతున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మళ్లీ డైలీ శానిటేషన్ రిపోర్ట్ యాప్ తీసుకురావడం సరైనది కాదని కార్యదర్శులు మండిపడుతున్నారు. కొత్త యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వం మినహాయించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.
డిఎస్ఆర్ యాప్ నుండి మినహాయించాలి.. గోద రాజు పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం జిల్లా అధ్యక్షులు

ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలలో పంచాయతీ కార్యదర్శుల కృషి చాలా ఉంది. పంచాయతీల నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. డైలీ శానిటేషన్ రిపోర్ట్ యాప్ నుండి పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం మినహాయించాలి. ప్రతిదీ ఆన్లైన్ వ్యవస్థ కావడంతో ప్రతి పనికి మండల పరిషత్తు ఆఫీస్ పై ఆధారపడి ఉండవలసి ఉంటుంది. మా సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు.