Saturday, March 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ..

మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్ : అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి వద్ద కలకలం రేపిన మేఘా ఇంజినీరింగ్ పైపుల దహనం కేసు మిస్టరీ వీడింది. పని ఒత్తిడి తట్టుకోలేక, సెలవు ఇవ్వలేదన్న అక్కసుతో ఆ సంస్థలోనే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని, కేవలం వ్యక్తిగత అసహనంతోనే జరిగిందని విచారణలో వెల్లడైంది.

దొండపాడుకు చెందిన రాము, రాయపూడి సమీపంలోని మేఘా క్యాంపులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం బంధువు చనిపోవడంతో సెలవు అడగ్గా, సూపర్‌వైజర్ నిరాకరించాడు. ఘటన జరిగిన రోజు (ఈ నెల 23న) ఉదయం షిఫ్ట్ పూర్తి చేసుకున్న రామును రాత్రి కూడా డ్యూటీ చేయాలని సూపర్‌వైజర్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

ఒక చిన్న ప్రమాదం సృష్టిస్తే, సిబ్బందిని పెంచుతారని, తద్వారా తనపై పనిభారం తగ్గుతుందని రాము భావించాడు. ఈ క్రమంలోనే జనరేటర్‌లోని డీజిల్‌ను ఒక సీసాలో నింపి, ఎండుగడ్డి సాయంతో పైపులకు నిప్పు పెట్టాడు. మంటలు కొంతమేర వ్యాపించాక ఆర్పేసి, ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నాడు. అయితే, మంటలు అదుపు తప్పడంతో అతడి ప్లాన్ విఫలమైంది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రాము సెల్ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు సూపర్‌వైజర్‌కు పంపిన ఫొటోలను విశ్లేషించగా, మంటలు రాకముందే తీసిన ఫొటోలో కనిపించిన వెలుగు పోలీసులకు అనుమానం కలిగించింది. మూడు రోజుల పాటు వివిధ కోణాల్లో విచారించగా, రాము తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -