పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
సోమవారం అతిభారీ వర్షాలు పడే అవకాశం
ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
శనివారం రాత్రి పది గంటల వరకు 436 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయనీ, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు, సోమవారం అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయనీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు. ఆదివారం ఎల్లో హెచ్చరికజాబితాలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలున్నాయి. సోమవారానికి సంబంధించి ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్, ఎల్లో హెచ్చరిక జాబితాలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వాన సాయంత్రం, రాత్రి సమయాల్లో కురిసే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయి. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 436 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మొత్తం 19 ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. 163 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం వాంకులంలో అత్యధికంగా 13.25 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. జనగామ జిల్లా, మండలంలోని వడ్లకొండలో 11.11 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో 150కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.