నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
“ఆయిల్ పామ్ పంటను ప్రస్తుతం వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుందనీ యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో డాక్టర్ ఎ శ్రీనివాస్ 23 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించగా, అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. పంట వేసిన 4 వ సంవత్సరం నుండి ఆయిల్ పామ్ లో పంట చేతికి అంది వస్తుందనీ , ఈ పంట సాగులో మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటగా పెసర, పత్తి ,మిర్చి, బొప్పాయి, వేరుశనగ వంటి పంటలను సాగు చేసుకుని రైతు ఆదాయం పొందవచ్చనారు. ఈ పంట సాగుతో రైతుకు ఎకరాకు 1.5 నుండి 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున ఈ పంటను సాగు చేయడం ఎంతో లాభదాయకం అన్నారు. ఈ పంట సాగులో చీడపీడల సమస్య, కోతుల బెడద, ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉండదు. దళారీ వ్యవస్థ కూడా ఉండదు.
ఎకరాకు 57 మొక్కల చొప్పున రాయితీపై 20/- రూపాయలకే రైతుకు అందజేయడం జరుగుతుందినీ, డ్రిప్పు పైపులకు ఎస్సి, ఎస్టిలకు 100%, బీసీలకు 90%, ఓసీలకు 80 శాతం రాయితీతో డ్రిప్పు పైపులు సరఫరా, తోట నిర్వహణ యాజమాన్య ఖర్చుల కొరకు , అంతర పంట సాగు కొరకు ప్రభుత్వం నుండి రైతుకు నాలుగు సంవత్సరాల వరకు ఎకరానికి సంవత్సరానికి ₹4,200 చొప్పున రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు .
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ , ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, ఎంపి డిఓ శ్రీనివాస్ , ఏడిఏ వెంకటేశ్వర్లు , రైతు మరియు రైతు సమాఖ్య సభ్యులు విజయపాల్ రెడ్డి , ఉద్యాన అధికారులు మాధవి, స్నేహిత, కవిత, స్రవంతి, భువనగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లేష్ , ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి ఖాజా , ఏఈఓ ప్రసన్న, ఆయిల్ ఫిడ్ సిబ్బంది పాల్గొన్నారు.