Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగౌలిదొడ్డి, అలుగునూరు సీవోఈల్లో పాత పద్ధతినే కొనసాగించాలి

గౌలిదొడ్డి, అలుగునూరు సీవోఈల్లో పాత పద్ధతినే కొనసాగించాలి

- Advertisement -

– 95 శాతం మార్కుల నిబంధనను తొలగించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గౌలిదొడ్డి, అలుగునూరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)ల్లో చదివిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 95 శాతం మార్కులొస్తేనే కొనసాగిస్తామనే నిబంధనను తొలగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్న మాదిరిగానే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోకి విద్యార్థులను అనుమతించా లని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన గౌలిదొడ్డి, అలుగునూరు గురుకుల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024 ఫిబ్రవరి నాలుగు, ఫిబ్రవరి 25న జరిగిన గురుకులాల సీవోఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఐపీఈ-2025 మార్చిలో జరిగిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో 95 శాతం మార్కులు వస్తేనే ఈ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో కొనసాగిస్తామనీ, లేకుంటే వేరే చోటకు తరలిస్తామని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలల్లో చేరే సమయంలో ఈ నిబంధన లేదని వివరించారు. ప్రస్తుతం కళాశాలకు వస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా తిరిగి ఇంటికి పంపుతున్నారని తెలిపారు. ఇప్పటికే కొంతమండి బైపీసీ విద్యార్థులను ఏ సౌకర్యాలు లేని చోటకు తరలించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో చదువుతున్న దళిత, మైనార్టీ, వెనకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమౌతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా దాదాపు పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన వారేనని గుర్తు చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం మార్కుల వల్ల పెద్ద ఉపయోగం లేకపోవడంతో డాక్టరో, ఇంజినీరో కావాలనే లక్ష్యంతో నీట్‌, ఐఐటీ సాధించడంపైనే దృష్టి పెడతారని తెలిపారు. యాజమాన్యంతోపాటు, అధ్యాప కులు కూడా ఇంటర్‌ మార్కులపై దృష్టి సారించకుండా నీట్‌, ఐఐటీ లక్ష్యంతోనే బోధిస్తారని గుర్తు చేశారు. కాబట్టి సీవోఈ పరీక్ష ద్వారా రెండు విడతలుగా ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రవేశాలు పొందిన ఈ విద్యార్థులకు ఇంటర్‌ మొదటి సంవత్సరం మార్కులతో ముడిపెట్టి ద్వితీయ సంవత్సరం చదవనీయకుండా బయటకు పంపడం సమంజసం కాదని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో తక్షణమే చర్చలు జరపడంతోపాటు, గతంలో ఉన్న మాదిరిగానే ఈ కళాశాలల్లో విద్యా విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -