నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. పహల్గామ్ దాడి నేపథ్యంలో నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. దీంతో నఖ్వీ ఆ ట్రోఫీని, మెడల్స్ను మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు ఇవ్వకుండా, తనతో పాటు తీసుకెళ్లి ఏసీసీ కార్యాలయంలో భద్రపరిచాడు. నాటి నుంచి ఆ ట్రోఫీని ఇవ్వడానికి షరతులు విధిస్తున్నాడు.
భారత జట్టు సెప్టెంబర్ 28న ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచినప్పటికీ, ఇప్పటి వరకు ట్రోఫీ, మెడల్స్ భారత్కు చేరలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ నఖ్వీ తాజాగా ఈ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అబుదాబిలోని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు కథనాలు వస్తున్నాయి.
బీసీసీఐకి చెందిన ఒక అధికారి ఇటీవల ఏసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి ట్రోఫీని సిబ్బంది తొలగించారని, ప్రస్తుతం అది నఖ్వీ ఆధీనంలో అబుదాబిలో గుర్తుతెలియని ప్రదేశంలో ఉందని తెలిసింది.



