నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాల పరంపర కొనసాగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య భీకర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా-యూఏఈ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. యెమెన్లో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో చెరో వర్గానికి సౌదీ అరేబియా-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో యూఏఈ మద్దతుగల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేసింది. ఈ ఘటనలో యూఏఈ మద్దతుగల యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే రెండు గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం యెమెన్ విషయంలో రెండు దేశాలు జోక్యం చేసుకుని స్నేహాన్ని చెడగొట్టుకున్నాయి.
దక్షిణ, తూర్పు యెమెన్లను యెమెన్ ప్రభుత్వం (ఐఆర్జీ) పాలిస్తోంది. ఈ సంకీర్ణంలో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ) కీలక భాగస్వామి. అయితే స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎస్టీసీ ముందుకు సాగడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయింది. వాస్తవంగా యెమెన్ సమైక్యంగా ఉండాలని సౌదీ భావిస్తోంది.. కానీ ఎస్టీసీ మాత్రం ఆ ప్రయత్నానికి తూట్లు పొడుస్తోంది. ఈ క్రమంలోనే యూఏఈ మద్దతుగల ఎస్టీసీపై సౌదీ దాడులు చేసింది.



