దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడున్నర దశాబ్దాలు దాటినా నేటికీ గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది. వాటి వటిష్టతే తమ ధ్యేయమని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు దాన్ని నిర్వీర్యం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులు, విధులు అప్పగిస్తామని ఆచరణలో మాత్రం వెనుకాడుగు వేస్తోంది. గ్రామసర్పంచులకు ఒక వ్యూహం ప్రకారం ప్రాధాన్యత తగ్గిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. అధికారం లేని ఉత్సవ విగ్రహాలుగా మార్చేలా పథకాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఒకనాడు సర్పంచులకు ఉన్న ప్రాధాన్యత నేడు కానరావడం లేదనేది వాస్తవం. ఇందుకు వారు వీరు అనేదానికంటే ఎవరు అధికారంలోకి వచ్చినా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనే చర్చ నేడు రాష్ట్రంలో జరుగుతున్నది. చివరకు నిబంధనల మేరకు ఐదేళ్లకోసారి జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఏదో కారణాలతో వాయిదాలు వేయడం దీనికి అద్దం పడుతున్నది. ఇన్ఛార్జీలతో స్థానిక సంస్థలను నడిపేందుకే మొగ్గు చూపడం వెనుక ఉన్నది, రాజకీయ కారణాలు తప్ప మరేం కాదనేది వాస్తవం.
అయితే గ్రామస్థాయిలో పలు సమస్యలు పరిష్కరించేందుకు పనిచేసిన సర్పంచులను పక్కకు పెట్టే కార్యక్రమాలు చేపట్టడం మాత్రం సరికాదు! ఇప్పుడు వేసిన ఎన్నో కమిటీలు సర్పంచులను పక్కకు పెట్టే విధంగానే ఉన్నాయి. వారి ప్రమేయం లేకుండానే ఎన్నో కార్యక్రమాలు గ్రామాల్లో జరిగే పరిస్థితులు తీసుకువచ్చారు. విద్యా కమిటీలు, ఆస్పత్రి కమిటీలు, నీటి సంఘాలు, వనరక్షణ సమతులు ఒక్కటేమిటి గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులకు సమాంతరంగా పదవులు సృష్టించారు. ఇలా కమిటీలు వేసి సమస్యలు పరిష్కరించాలనుకోవడం మంచిదే.కానీ, సర్పంచులను ప్రాధాన్యత ఇవ్వకపోవడం కరెక్ట్కాదనే అభిప్రాయం వ్తున్నది. నేతల వాగ్దానాలతో ఏదో సాధించాలని, సమాజానికి ఏదోచేయాలని తపనతో ఎందరో యువకులు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నో వ్యయ ప్రయాసలకులోనై సర్పంచులయ్యారు. గ్రామాభివృద్ధికి తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చుకునేందుకు నడుంకట్టారు. గ్రామ ప్రజలకు తాము చేసిన వాగ్దానాలను పూర్తి చేసేందుకు అప్పులు చేసి కొన్ని గ్రామాల్లో పనులు పూర్తిచేశారు. అయితే ఎంతకూ బిల్లులు రాకపోవడం, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి, ఇంకొకపక్క అప్పులు, వడ్డీలు పెరిగి, మరొక పక్క సమాజంలో తలవంచుకోలేక డజన్ మందికి పైగా సర్పంచులు రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెందరో సర్పంచులు అనేక అవస్తలు పడుతున్నారు.గతేడాది జనవరి 31తేదీతో సర్పంచుల పదవీకాలం పూర్తయిపోయింది. ఫిబ్రవరి నుంచి వారు మాజీలయ్యారు. వారి స్థానాల్లో ప్రత్యేక అధికారులను నియమించగా ఆగమేఘాల మీద వారివద్ద నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే బిల్లులు వస్తాయో రావో తెలియదు. వస్తే ఎప్పుడు వస్తాయో చెప్పేవారు లేరు. ఇప్పటికీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తామని చెప్పడం మన నాయకులకు బాగా అలవాటైన పదం. మరి లక్ష్యసాధనలో స్థానిక సంస్థల పటిష్టత అన్నది ఒక ముఖ్యమని మరచిపోవడం మాత్రం బాధాకరమైన విషయం. భారత రాజ్యాంగంలో కూడా స్థానిక సంస్థలకు అవసరమైన అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉన్నది. 1952 నుంచి ఎన్నో కమిటీలు, మరెన్నో అధ్యయనాలు, మార్పులు, చేర్పులు, పంచాయతీ వ్యవస్థలో చేశారు. కానీ సర్పంచులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఇవ్వడానికి మాత్రం పాలక పెద్దలకు మనసొప్పడం లేదు. రానురానూ పంచాయతీరాజ్ వ్యవస్థను నామమాత్రంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న పరిణమాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలతో ఎన్నికైన సర్పంచును సస్పెండ్ చేసే అధికారం అధికారులకు కట్టబెట్టిన పాలన ఎలాంటిదో అర్థం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు నేతలు మారినా, అధికార వికేంద్రీకరణ మాత్రం ఆదినుంచి అధికారంలో ఉన్న పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్నది. ప్రజాస్వామ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థ పునాది వంటిది. అందులో సర్పంచుల పాత్ర చాలా కీలకం. అయితే వారిని గౌరవపరిచేలా, వారికి నిధులిచ్చి ఖర్చుచేపించే విధంగా వ్యవస్థ ఉండాలే కానీ, సర్పంచులను పక్కకు పెట్టి పరిపాలిస్తామనడం సమంజసం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని వేదికల్లో, సభలు, సమావేశాల్లో ఉపన్యాసాలు వళ్లించే నేతలు తెలంగాణలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రత్యేక అధికారులతో పాలన చేస్తూ కాలయాపన చేయడం ఎంతమాత్రం సరికాదన్న విషయాన్ని గమనించాలి.
– సభావట్ కళ్యాణ్, 9014322572
పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతున్న వేళ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES