నవతెలంగాణ – మల్హర్ రావు
పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఏటా వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు కొనలేనంతగా ఉంటున్నాయి. పండగల వేళ కాకుండా మామూలు రోజుల్లోనూ తగ్గడం లేదు. మండలంలో పూల సాగు లేదు. ఒకవేళ చేపట్టినా బంతి రకాల పైనే దృష్టిసారిస్తారు. చామంతి, గులాబీ, సీతజడ, బంతి తదితర రకాల పూలను సాగు చేయటం లేదు. దీంతో ధరలపై ప్రభావం పడుతోంది. మార్కెట్ లో వ్యాపారులు చామంతి, గులాబీ, తెల్లచామంతి, బంతి, సీతజడ తదితర రకాల పూలు విక్రయిస్తుంటారు. చామంతి గతేడాది కిలో రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.350 పలుకుతోంది.గులాబీ పూలు గతేడాది రూ.200 ఉక్కడగా ప్రస్తుతం రూ.400 పలుకుతోంది.
తెల్ల చామంతి గతేడాది రూ. 150 ఉండగా ప్రస్తుతం రూ.300, బంతి పూలు రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.100 పలుకు తోంది. ఇలా ధరలు రెట్టింపు ఉండడంతో కొనుగోలు దారులు కాస్తా అచూతూచి కొనాల్సిన దుస్థితి నెలకొంది.పూలు రెట్టింపుతోపాటు మరి కొన్ని పూలు రెండింతలు ధరలు పెంచారు. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో సామాన్యులు కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండుమూడు కిలోలు ఖరీదు చేసినవారు నేడు కిలోకే పరిమితమయ్యారు. ఒక్క పూలకే ప్రతి ఒక్కరూ రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..
స్థానికంగా పూల సాగు తక్కువగా ఉండటంతోపాటు వ్యాపారులు మహా రాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా ఖర్చులు కూడా గతంలో టన్ను రూ.10,000 ఉండగా నేడు రూ.16,000 వరకు పెరిగింది. ఒక్క టన్నుకే రూ.6 వేలు పెరగటంతో లాభాలు అంతంతగానే ఉంటున్నాయని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.
గతంలో బాగా లాభాలు: పూలక్క వ్యాపారి
గతంలో ధరలు తక్కువగా ఉండటంతో లాభాలు బాగున్నాయి. ప్రస్తుతం ధరలు పెరిగినా రవాణా,కూలీల లాభాలు ఉండటం లేదు. ముగ్గురు పని వాళ్లు అవసరం. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేతనం ఇవ్వాల్సి వస్తోంది. అన్ని పోను నెలకు రూ.20 వేల ఆదాయం వస్తుంది. గతేడాది రూ.30 నుంచి 40 వేల వరకు ప్రతి నెలా లాభాలుండేవి.