కలెక్టర్ బి ఎం సంతోష్
నవతెలంగాణ-జోగులాంబ గద్వాల : జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్, రెండవ వాటర్ బాడీస్ సెన్సెస్ జిల్లాలో ఏ విధంగా నిర్వహించాలని అంశంపై జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. రెండు వేల హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు. మొదట ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గణన పూర్తిచేసిన తర్వాత, తదుపరి గ్రామాల గణనను కొనసాగించాలన్నారు. తహసీల్దార్,ఎంపీడివో,నీటిపారుదల శాఖ ఏఈలు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు ఎన్యూమరేటర్లు గా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 202 రెవెన్యూ గ్రామాల్లో చిన్న నీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్స్ ను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, ఇతర జల వనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమరేటర్లకు జిల్లా, మండలాల స్థాయిలో త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీటి ద్వారా ఎన్యూరేటర్లకు మొబైల్ అప్లికేషన్ గణన ప్రక్రియపై స్పష్టంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. నీటి పారుదల, విద్యుత్, ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను గణన చేస్తున్న అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా గణన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,సీపీఓ పాపయ్య, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు, భూగర్భ జల వనరుల శాఖ డీడీ మోహన్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, విద్యుత్ శాఖ డీఈ తిరుపతిరావు, డిప్యూటీ ఎస్ఓ లు హరికృష్ణ, హైమావతి, డిఆర్డిఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



