– ఆదివాసులను మట్టుబెట్టడం దుర్మార్గ చర్య
– మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సమస్యలను పరిష్కరించాలంటే దాని మూలాలను గుర్తించాలని.. అందుకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఆదివాసీలను మట్టుబెట్టడం, మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చర్యలు చేపట్టడాన్ని తప్పు పట్టారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులు శాంతియుత చర్చల కోసం ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. వారిని మట్టుబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలను, మావోయిస్టులను చంపుతూ ఆపరేషన్ కగార్ విజయవంతమైందన్న పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారని, దేశ ప్రజలను చంపడం కూడా ఓ ఆపరేషనా.. ఏమైనా శత్రువులను చంపారా.. అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ, కాశ్మీర్లో శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పుకుంటూ వచ్చారని.. కానీ పహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడులు చేయడంతో అక్కడి పరిస్థితులు బయటపడ్డాయని అన్నారు. అయినా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆరోపించారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను దేశ ప్రజలకు వివరించేందుకు పార్లమెంట్ సమావేశాలు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ భారత ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నట్టుగా మాట్లాడటం ప్రధానమంత్రి దానిపైన నోరు మెదపకపోవడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, ఎస్.రమ, పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు వై.గంగాధర్, నన్నేసాబ్, కొండ గంగాధర్, సుజాత, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్య మూలాలు గుర్తించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES