Saturday, September 20, 2025
E-PAPER
Homeఆటలుదాయాదుల పోరుకు మళ్లీ ఆ రిఫరీనే..!

దాయాదుల పోరుకు మళ్లీ ఆ రిఫరీనే..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రేపు (ఆదివారం) జరగనున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఐసీసీ మళ్లీ ఆండీ పైక్రాఫ్ట్‌నే మ్యాచ్ రిఫరీగా నియమించింది. ఆయన నియామకంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గలేదు. పీసీబీ విన్నపాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తూ, తమ నిర్ణయానికే కట్టుబడింది.

గత ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం మొదలైంది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు తమ విధానపరమైన నిర్ణయం ప్రకారం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. అదే సమయంలో, టాస్ వద్ద భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ సంప్రదాయాన్ని పాటించకపోవడంతో పైక్రాఫ్ట్ తీరుపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పీసీబీ, పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుంచి, ముఖ్యంగా తమ మ్యాచ్‌ల నుంచి తప్పించాలని కోరుతూ ఐసీసీకి రెండుసార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

అయితే, పీసీబీ చేసిన రెండు అభ్యర్థనలను ఐసీసీ తోసిపుచ్చింది. పైక్రాఫ్ట్ ‘క్రీడా స్ఫూర్తి’ని ఉల్లంఘించారన్న వాదనలను ఖండించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెన్యూ మేనేజర్ చెప్పిన సందేశాన్ని మాత్రమే పైక్రాఫ్ట్ తెలియజేశారని, ఆయన కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని ఐసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ సమాచారం అందడంతో దానిని చేరవేయడం మినహా ఆయన ఏమీ చేయలేకపోయారని వివరణ ఇచ్చింది.

ఈ వివాదంపై పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ (కెప్టెన్ సల్మాన్, హెడ్ కోచ్ మైక్ హెస్సన్, మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా)తో పైక్రాఫ్ట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, సమాచార లోపం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పలేదని, కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేశారని ఐసీసీ తర్వాత మరో ఈ-మెయిల్‌లో స్పష్టం చేసింది. అంతేకాకుండా పీసీబీ ‘ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (పీఎంఓఏ) నిబంధనలను ఉల్లంఘించిందని ఐసీసీ ఆరోపించగా, పీసీబీ దానిని ఖండించింది.

ఈ నేపథ్యంలో మరో కీలకమైన భారత్-పాక్ మ్యాచ్‌కు మళ్లీ పైక్రాఫ్ట్‌నే నియమించడం ద్వారా ఐసీసీ తమ వైఖరిని స్పష్టం చేసింది. ఒక బోర్డు ఒత్తిడికి తలొగ్గి రిఫరీని మారిస్తే, అది భవిష్యత్తులో తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -