నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో వాతావరణంలో హఠాత్తు మార్పులు చోటుచేసుకున్నాయి. మే నెల చివరి వారంలో వర్షాలు పడగా..పలు రోజులనుంచి ఆయా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఢిల్లీవాసులు ఉక్కపోతతో, వేడి గాలులతో అల్లాడిపోతున్నారు. గురువారం కూడా నగరంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ను దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఉదయం 8.00 గంటలకే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఢిల్లీలోని అయన్ నగర్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అయన్ నగర్ ప్రాంతంలో గరిష్టంగా 45 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలుగా ఉంది. వరుసగా పాలం ప్రాంతంలో 44.5 (గరిష్టం), 30.2 (కనిష్టం), రిడ్జ్లో 43.6 (గరిష్టం) , 26.2 (కనిష్టం) , లోధి రోడ్లో 43.4 (గరిష్టం), 29.2 (కనిష్టం), మరియు సప్దర్గంజ్ ప్రాంతంలో 43.3 (గరిష్టం), ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ సహా ఎన్సిఆర్ ప్రాంతాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ వారం ప్రారంభంలో ఐఎండి హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాయువ్య భారతదేశంలో మరో నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకావం ఉందని హెచ్చరించింది. అధిక వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీచేసినట్లు ఐఎండి అధికారి అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. జూన్ 14 తర్వాత క్రమంగా వేడిగాలుల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి సాధారణ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది.