కోవిడ్ వంటి కష్ట సమయాల్లో మెరుగైన వైద్య సేవలు
డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
కోఠిలో తెలంగాణ వైద్య భవన్ ప్రారంభం
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలంగాణ వైద్య భవన్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు కోవిడ్ వంటి కష్ట సమయంలో వారు అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రజలకు సేవలందించే డాక్టర్లకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా వైద్యులు కోరుతున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చినట్టు వెల్లడించారు. గోషామహల్లో సుమారు 26 ఎకరాల్లో రూ.3000 కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రెండేండ్లలో ఆరోగ్యశాఖలో 10,327 నియామకాలు పూర్తి చేసినట్టు తెలిపారు. మరో 6,000కి పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల 174 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. భవిష్యత్లో డాక్టర్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
డీపీహెచ్, టీవీవీపీలో పనిచేస్తున్న స్పెషలిస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం పెంచినట్టు చెప్పారు. ట్రాన్స్ఫర్లను పారదర్శకంగా నిర్వహిస్తూ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇస్తున్నామని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరూ హైదరాబాద్లోనే పోస్టింగ్ కోరడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్ల పేరుతో వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దని సూచించారు. హెచ్ఆర్, మౌలిక వసతులు, పరికరాలు, ఔషధాలు, డయాగస్టిక్స్ అన్నీ ప్రభుత్వం సమకూర్చుతున్నప్పటికీ, చివరికి ప్రజలకు సేవలు అందించాల్సింది వైద్యులేనని అన్నారు. జిల్లాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు సేవలందించడంలో వైద్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా, కమిషనర్ డా.సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రెటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ రవూఫ్, ఇతర ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.



