Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం తీరుతో రాష్ట్రానికి నష్టం

సీఎం తీరుతో రాష్ట్రానికి నష్టం

- Advertisement -

– సాగునీటి ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేదు
– అబద్ధాన్ని సమర్థించుకునేందుకు మరిన్ని అబద్ధాలు
– మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల వాటా, వినియోగంపై సీఎం రేవంత్‌రెడ్డికి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి బ్యాగుల మీద ఉన్న జ్ఞానం బేసిన్ల మీద లేదని ఎద్దేవా చేశారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని తెలిపారు. దానిలో అడ్డూ అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని పారించారన్నారు. బనకచర్ల విషయంలో నిద్రలేపిందే బీఆర్‌ఎస్‌ అని గుర్తుచేశారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి బనకచర్ల నుంచి ఎంతైనా తీసుకుపోవచ్చని సీఎం అన్నారని ఆక్షేపించారు. 968 టీఎంసీలకు రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందనీ, అందులో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇక చంద్రబాబు ఇచ్చేదేంటని ప్రశ్నించారు. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయనీ, అందులో 1,950 టీఎంసీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేసీఆర్‌ జలశక్తి మంత్రికి లేఖ రాశారని గుర్తుచేశారు. 750 టీఎంసీల నీళ్లు రావాలని బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్రం తరపున వాదించినట్టు హరీశ్‌ రావు చెప్పారు. కష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయన్నారు. 763 టీఎంసీల నీళ్లు రావాలని లాయర్లకు సూచించామన్నారు. పోలవరం ద్వారా మళ్లించే 80 టీఎంసీల్లో కూడా 45 టీఎంసీలు రావాలన్నారు. కృష్ణా బేసిన్‌లో రాష్ట్రానికి మొత్తం 763 టీఎంసీలు రావాలని ట్రిబ్యునల్‌ ముందు అఫిడవిట్‌ ఫైల్‌ చేశామని తెలిపారు. సీడబ్ల్యూసీ గోదావరి నీళ్లు సముద్రంలో ఏ మేరకు కలుస్తున్నాయో 60 ఏండ్ల లెక్కలు చెప్పిందనీ, కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలు కలిపి వెయ్యి టీఎంసీలను కూడా వినియోగించుకోవడం లేదని తెలిపారు.
గతంలో జరిగిన అపెక్స్‌ సమావేశాల్లో బనకచర్ల అనే చర్చే లేదని స్పష్టం చేశారు. 2004- 14 మధ్యలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలుంటే 2014-23 మధ్య 48.74 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. సమ్మక్క సాగర్‌, సీతమ్మ సాగర్‌ ఇలా అన్ని ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్‌, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ పూర్తి చేసి 6.50 లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు ప్రారంభమైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదనీ, అడ్డుకోలేదని ఆరోపించారు. అప్పట్లో పోతిరెడ్డి ప్రాజెక్టును నిరసిస్తూ ఆరుగురు మంత్రులం రాజీనామా చేశామని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు సీఎం రేవంత్‌రెడ్డిది తెలంగాణ ద్రోహ చరిత్రనేనని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -