నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్పోర్ట్ లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ‘ఆ యువకుడు తప్పు చేశాడు. హర్యాణాకు చెందిన అతడు చట్టవిరుద్ధంగా, సరైన వీసా లేకుండా ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ప్రయాణ సమయంలో అతడి ప్రవర్తన కూడా సరిగా లేదు. దీన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పరిస్థితి మెరుగుపడిన తర్వాత భారత్కు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని భారత విదేశాంగశాఖ అధికారులు పేర్కొన్నారు.
కాగా, యూఎస్ లోని న్యూజెర్సీ ఎయిర్పోర్టులో భారతీయ విద్యార్థిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది. అమెరికా చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతించడం కొనసాగిస్తున్నప్పటికీ, అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాలను ఉల్లంఘించడాన్ని సహించబోమని, అలాంటి వారికి అమెరికా సందర్శించే హక్కు లేదని యూఎస్ ఎంబసీ పేర్కొంది. “యునైటెడ్ స్టేట్స్ మా దేశానికి చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతిస్తూనే ఉంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి యునైటెడ్ స్టేట్స్ను సందర్శించే హక్కు లేదు. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, యుఎస్ చట్ట ఉల్లంఘనను మేము సహించము” అని మంగళవారం ఎక్స్లో రాసుకొచ్చింది.