Wednesday, June 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉపాధ్యాయుల పోరాట విజయం- గత పాలకులకు చెంపపెట్టు

ఉపాధ్యాయుల పోరాట విజయం- గత పాలకులకు చెంపపెట్టు

- Advertisement -

గత సర్కార్‌ ఉద్యోగులు, సంఘాల పట్ల వ్యవహరించిన నిరంకుశ వైఖరి తెలిసిందే. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ప్రస్తుత ప్రభుత్వ నాన్చుడు ధోరణి, కాలయాపన కత కనిపిస్తున్నదే. ఉపాధ్యాయులది ఐదేండ్ల కిందటి పోరాటమే అయినా దాని విజయం గత పాలకులకు చెంపపెట్టు. అప్పుడు మూడు నెలల్లో ఇస్తానన్న పిఆర్సీ ముప్పై నెలలైనా జాడలేదు. ఆరేండ్లుగా పదోన్నతులు లేవు, మూడేండ్లుగా బదిలీలు లేవు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్‌ ఇవ్వరు. మంత్రులు, అధికారులు నిమిత్త మాత్రులు. ఉపాధ్యాయులు, ఉద్యో గులు, పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకున్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) స్టీరింగ్‌ కమిటీ జాక్టోతో కలిసి జెఎసి ఏర్పాటు కోసం అన్ని సంఘాలతో సంప్రదిం పులు చేసింది. కలిసొచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో ఐక్య వేదిక ఏర్పాటు చేసింది. 2020 మార్చి 13న చారిత్రాత్మక ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్‌ కారణంగా కొంతకాలం ప్రత్యక్ష పోరాటాలకు విరామం తీసుకుంది. కోవిడ్‌ నెమ్మదించిన తర్వాత యుయస్పిసి, జాక్టో కలిసి దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చాయి. 2020 డిసెంబర్‌ 17 న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాయి. డిసెంబర్‌ 29న హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ లో మహాధర్నా నిర్వహించింది. ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జిల్లాల్లో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేసి ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పెద్ద సంఖ్యలో ఉపాధ్యా యులు తరలివచ్చారు. చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసు కోకుండా శాంతియుతంగా ధర్నా జరిగింది. శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. జనవరిలో పీఆర్సీ అమలు చేస్తామని, ఫిబ్రవరిలో ప్రమోషన్లు ఇస్తామని అదేరోజు సాయంత్రం సిఎంఓ నుండి ప్రకటన వెలువడింది. డిసెంబర్‌ 31న బిశ్వాల్‌ కమిటీ పీఆర్సీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కానీ జనవరి మూడో వారం వరకు పీఆర్సీ నివేదికను ప్రభుత్వం విడుదల చేయలేదు. పీఆర్సీ నివేదిక బయట పెట్టాలని కోరుతూ 2021 జనవరి 23 న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘా ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో హఠాత్తుగా అనుమతి రద్దు చేసి ఐక్యవేదిక నాయకులను ధర్నా చౌక్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుని అరెస్టు చేశారు.
జనవరి 27న పిఆర్సీ నివేదిక సోషల్‌ మీడియా ద్వారా అనధికారికంగా బయటకు వచ్చింది. 7.5శాతం ఫిట్మెంట్‌ను, 15.6శాతం తో మాస్టర్‌ స్కేలును కమిటీ సిఫారసు చేసింది. ఈ సాడే సాత్‌ పిఆర్సీ మాకవసరం లేదంటూ అదేరోజు సాయంత్రం ఐక్యవేదిక ఆధ్వర్యంలో బిఆర్కే భవన్‌ ఎదుట పీఆర్సీ రిపోర్టు కాపీలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఆ సందర్భంగా నాయకులను అరెస్టు చేశారు. పిఆర్సీ నివేదికపై సంఘాలతో సంప్రదింపుల కోసం సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకఅష్ణారావు, మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌కుమార్‌ లతో ఉన్నతాధికారుల కమిటీని అదేరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి రోజు(జనవరి 28) నుండి రెండు రోజులపాటు హైపవర్‌ కమిటీ వివిధ సంఘాలతో చర్చలు నిర్వహించింది. సంఘాలన్నీ తమ అభిప్రాయాలను కమిటీ ముందు వెల్లడించాయి. అయితే ఉపాధ్యాయులకు పిఆర్సీ లేదని, రిటైర్మెంట్‌ వయసు పెంపు కూడా ఉండదని, ఉపాధ్యాయులకు సెలవులెక్కువని, జవాబుదారీతనం లోపించిందని అందుకే ఉపాధ్యాయులను స్థానిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు, పీఆర్సీ చర్చల సందర్భంగా ఉన్నతాధికారుల కమిటీతో టిఎస్‌యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి అహంభావ పూరితంగా వ్యవహరించినట్టు, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేటట్లు మీడియాలో మాట్లాడినట్టు, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సిఎంఓ నుండి వండివార్చిన అనధికారిక వార్త ఫిబ్రవరి పదిన కొన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైంది. ఇది మొత్తం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని మరింత పెంచింది. టిఎస్‌యుటిఎఫ్‌ యుయస్పిసి ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండేందుకు కొన్ని సంఘాలను దగ్గరకు తీసి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. అనివార్యమైన పరిస్థితుల్లో 30శాతం ఫిట్మెంటు, రిటైర్మెంట్‌ వయసు 61 సంవత్సరాలకు పెంపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాలతో ప్రభుత్వానికి ఆశించిన మైలేజీ రాకపోగా 33 నెలలు ఆలస్యంగా ప్రకటించారని, 21 నెలలు బకాయిలు నష్టపోయామని, 2017 టిఆర్టీ, 2019 గురుకుల టీచర్లకు ఫిట్మెంట్‌ ప్రయోజనం లేదని ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఐక్య వేదిక పోరాటాల ఫలితంగానే ఈ ఫలితాలు వచ్చాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడిచింది. ప్రభుత్వం తట్టుకోలేక యుయస్పిసి, జాక్టో నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది.
2020 డిసెంబర్‌ 29న పోలీసులు అనుమతించిన సంఖ్యకంటే అదనంగా ఉపాధ్యా యులను సమీకరించారని, కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ అతిక్రమించారని ఆరోపిస్తూ యుయస్పిసి స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావరవి, టి లింగారెడ్డి, జాక్టో చైర్మన్‌ జి సదానందం గౌడ్‌ల పై గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెం. 421/2020 నమోదు చేసి, ఐపిసి సెక్షన్లు 269, 290, 341 ఆర్‌/డబ్ల్యూ 34, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 21/76 కింద 2021 ఏప్రిల్‌ 1న సికిందరాబాద్‌ సిటీ కోర్టులో కేసు రిజిస్టర్‌ చేయబడింది. 2021 జులై 22న తొలి హియరింగ్‌ తో ప్రారంభమైన విచారణ 39 వాయిదాలతో కొనసాగి 2024 ఏప్రిల్‌ 22 న ముగిసింది. అసౌకర్యం కలిగినట్లు పబ్లిక్‌ నుండి ఎలాంటి ఫిర్యాదు లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. శాంతి భద్రతలకు భంగం కలగలేదు. అయినా తప్పుడు సాక్ష్యాలతో గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఉపాధ్యాయ నాయకుల పక్షాన న్యాయవాదులు జివిఎల్‌ మూర్తి, స్రవంతి సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రడ్డిని కలిసిన ప్రతిసారి ఉపాధ్యాయ సంఘాల నాయకులపై గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసును ఎత్తివేయాలని వినతిపత్రా లిచ్చారు. వారు సానుకూలంగా స్పందించారు. కేసు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసు ఉపసంహరణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పదే పదే అడిగితే గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అనేకం ఉన్నాయి. అసెంబ్లీలో చర్చించి వాటన్నింటిని ఒకేసారి ఉపసంహరిస్తామన్నారు. ఆ పని కూడా చేయలేదు. మే8న తీర్పు వెలువడింది. ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి విజయం లభించింది. గత పాలకుల కక్షసాధింపు చర్యలకు ఈతీర్పు చెంపపెట్టులాంటిది.
చావ రవి
9490300571

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -