వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
పంటల సాగు కోసం సింగూరు ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల
కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల తనిఖీ
నవతెలంగాణ-పుల్కల్
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్, చౌటకూర్, ఆందోల్ మండలాల్లో ఖరీఫ్ పంటల సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకున్నప్పటికీ సాగు కోసం సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నియోజకవర్గంలోని ఆయకట్టుకు ప్రభుత్వం మొదటి విడతలో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ నీటితో ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నిండుతాయన్నారు. సింగూరు నుంచి ఆయ కట్టుకు నీరు విడుదల కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాసంస్థలను తనిఖీ చేసిన మంత్రి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలను మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చనున్నట్టు తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లోని సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యాసంస్థల్లో శానిటేషన్పై దృష్టి పెట్టడంతో పాటు, సీఎస్ఆర్ నిధులతో ఆయా విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆందోల్ ఆర్డీఓ పాండు, తహసీల్దార్ కృష్ణ. ఇరిగేషన్ అధికారి నాగరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్, మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, యూత్ అధ్యక్షులు ఉదరు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES