నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఎయిరిండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటన విడుదల చేసింది. విమానాలు తనిఖీ కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది.
ఎయిరిండియాకు చెందిన AI 2732 విమానం తమిళనాడులోని కోయంబత్తూర్కు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్వే దిశగా కదులుతోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ల్యాండ్ అయిన ఇండిగో విమానం (6E791) పార్కింగ్ బే వైపు వెళ్తోంది. ఈ సమయంలో వాటి రెక్కలు పరస్పరం ఢీ కొన్నాయి. రెండు విమానాల రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు డీజీసీఏ వెల్లడించింది.


