నవతెలంగాణ-హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ నేడు ముంగేర్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా.. చందన్ బాగ్ చౌక్లో బజరంగ్బలి ఆలయంలో హనుమాన్జీకి వారిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే ఆరో రోజుకి చేరుకున్న ఈ యాత్ర నేడు సుల్తాన్గంజ్ చౌక్, అక్బర్ నగర్లోని ఖరాహియా ఇంటర్ స్కూల్ మైదానంలో జరగనున్న సభతో ముగియనుంది. ఈరోజు నాలుగు గంటలకు నథాన్గర్లో జరగనున్న బహిరంగ సభకు రాహుల్గాంధీ ప్రసంగించనున్నారు.
కాగా, ఓటర్ అధికార్ యాత్ర 21వ తేదీన వాయిదాపడింది. ఉపరాష్ట్రపతి నామినేషన్ దాఖలు వేసే కార్యక్రమం సందర్భంగా రాహుల్ ఈ యాత్రలో పాల్గొనలేదు. ఈ యాత్ర సందర్భంగా రాహుల్గాంధీ, తేజస్వియాదవ్లు ఎన్నికల సంఘంపైనా, నితీష్కుమార్ ప్రభుత్వంపైనా, ఎస్ఐఆర్ ప్రక్రియపైనా తీవ్ర విమర్శలు చేశారు.
ఓట్లను తారుమారుచేయడంపైనే బిజెపి ఎన్నికల విజయం దాగి ఉంది. దేశంలో కీలకమైన మార్పు జరగాలని చూసిన ప్రతిసారీ బిజెపి గెలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బిజెపి గెలవడానికి ప్రధాన కారణం ఓట్ల చోరీనే. ఇప్పుడు అదే పద్ధతిని బీహార్లో పునరావృతం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది అని రాహుల్ ఆరోపించారు. ఈ ఓటర్ అధికార్ యాత్ర బిజెపి, ఎన్నికల సంఘం చేస్తున్న అవకతవకల్ని బటయపెట్టడానికి చేపట్టిన యాత్ర అని రాహుల్ అన్నారు. బీహార్లో బిజెపి ట్రిక్స్ పనిచేయవు అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బిజెపి, నితీష్కుమార్ ఓటమి పాలైనప్పుడల్లా ఎన్నికలను తారుమారు చేస్తారని తేజస్వియాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బీహార్కు రానున్నారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో ఏం చేశారు? అనేదానిపై ఈ 11 సంవత్సరాల పాలనకు సంబంధించిన రిపోర్టు ఇవ్వాలి. దాదాపు ప్రతి ఎన్నికలోనూ బిజెపి ఓడిపోయే అవకాశం ఉంది. కానీ వారు ట్రిక్స్ ప్లే చేసి గెలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బీహార్ ప్రజలను మోసం చేయగలనని ప్రధాని భావిస్తున్నారు’ అని తేజస్వియాదవ్ అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలోని ప్రజా సమస్యలకు ఆయనకు పట్టడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారింది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. నిరుద్యోగం, వలసలు నివారించడంలో, సరైన విద్య అందించడంలో నితీష్కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి విషయంలోనూ విఫలమైంది. అందరూ ఐక్యంగా ఉండి.. ఈ ప్రభుత్వాన్ని కూలదోయండి అని ప్రజలకు తేజస్వి కోరారు.