– కులగణనకు ఓకే అనక తప్పని పరిస్థితి
– జనగణనతో పాటు నిర్వహణకు కేంద్రం నిర్ణయం
– ఒకపక్క బీహార్ ఎన్నికల్లో ‘నితీశ్ భయం’
– ప్రస్తుత ఎన్డీఏ-3లో అత్యంతక కీలక భాగస్వామిగా జేడీయూ
– మరోపక్క ప్రతిపక్షాల నిరంతర డిమాండ్లు
– మోడీ సర్కారు సడెన్ యూటర్న్ వెనుక రాజకీయ కారణాలు
దేశంలో కులగణన నిర్వహణపై కేంద్రంలోని మోడీ సర్కారు ఆది నుంచీ అంతగా ఆసక్తి చూపలేదు. దీనిపై కాంగ్రెస్ వంటి ఇండియా బ్లాక్లోని ప్రతిపక్ష పార్టీల డిమాండ్లను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉన్నట్టుండి మోడీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఎట్టకేలకు కులగణనకు ఒప్పుకున్నది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహిస్తామని ముందుకొచ్చింది. ఈ మేరకు మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ఏప్రిల్ 30న ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం రాజకీయ పరిశీలకులు, నిపుణులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రతిపక్షాల నిరంతర డిమాండ్ నేపథ్యంలో రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు చెప్తున్నారు.
న్యూఢిల్లీ: హిందూత్వ ఎజెండాగా పనిచేసే సంఘ్ అడుగు జాడల్లో నడిచేదే బీజేపీ. కేవలం మతం ఆధారంగా హిందువులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందటం బీజేపీకి తెలుసు. అయితే, కులాలవారీగా విభజించి చూస్తే అది తమకే నష్టమన్నది సంఘ్, బీజేపీల భావన. అలాంటిది, కులగణనకు మోడీ సర్కారు పచ్చ జెండా ఊపటం ఆశ్చర్యం కలిగించక మానదని విశ్లేషకులు చెప్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో బీజేపీ విజయం సాధించింది. అక్కడ ప్రభుత్వాలనూ ఏర్పాటు చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం తర్వాత.. కులగణన విషయంలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని మోడీ చేశారు. ” ఎన్నికల సమయంలో కొందరు దేశాన్ని కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేశారు. నాకు మాత్రం దేశంలో నాలుగు కులాలే ఉన్నాయి. అవి, మహిళలు, యువత, రైతులు, పేదలు” అని ప్రధాని చెప్పారు. ఈ ప్రకటనకు రెండేండ్ల ముందు కూడా కులాలవారీగా గణన ఉండదని మోడీ సర్కారు లోక్సభలో వెల్లడించింది. ఇంతలోనే ఏమైందో కానీ.. తమ మూల సిద్ధాంతానికి భిన్నమైన దారిలో పయనిస్తూ కేంద్రం కులగణనకు సై అన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీహార్ ఎన్నికల ఎఫెక్ట్
గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చార్ సౌ పార్ నినాదంతో 400 సీట్లను సాధించటమే లక్ష్యంగా పోటీ చేసింది. అయితే, విస్పష్ట మెజారిటీని కూడా సాధించలేక 240 స్థానాలకే పడిపోయింది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జేడీ(యూ), ఏపీ సీఎం చంద్రబాబుల టీడీపీ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ను దాటి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అతికష్టం మీద మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ కూటమిలో జేడీ(యూ), టీడీపీలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా, రాజకీయాల్లో నితీశ్ అస్థిర వ్యవహారశైలి గురించి అందరికీ తెలిసిందే. లోక్సభ ఎన్నికల ముందు వరకూ ఆయన కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో బీహార్లో కులగణననూ జరిపారు. అంతేకాదు.. ఇండియా బ్లాక్ ఏర్పాటు లోనూ గురుతర బాధ్యతను పోషించారు. తీరా లోక్ సభ ఎన్నికల సమయానికి ఎన్డీఏ పంచన చేరారు. లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన సీట్లను సాధించి.. ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నారు.ల
నై అంటే నితీశ్ రూపంలో గండం
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో కులగణనను నితీశ్ సర్కారు నిర్వహిం చింది. దేశవ్యాప్తంగానూ తీవ్ర ప్రచారం కల్పించు కున్నది. ఇప్పుడు, కేంద్రంలోని మోడీ సర్కారు దేశవ్యాప్తంగా కులగణను వద్దనుకుంటే.. బీహార్లో బీజేపీ-జేడీ(యూ)లకు పెద్ద చిక్కే వచ్చిపడుతుంది. కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి.. కులగణన విషయం లో ఎన్డీఏకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారాన్ని చేసేది. అదికాస్తా, ఎన్డీఏకు అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను తీసురావొచ్చనీ, దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన నితీశ్ తమకు ఎక్కడ దూరమవుతాడోనని బీజేపీ భయ పడి ఉండొచ్చు. ఈ కారణంగానే దేశవ్యాప్త కుల గణనకు మోడీ సర్కారు ఒప్పుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్రెడిట్ కోసం కాషాయపార్టీ పాకులాట.. ఎస్ఈసీసీ డేటాను బహిర్గతం చేయని వైనం
కులగణన అంటేనే ఆమడ దూరంలో ఉండే బీజేపీ.. రాజకీయంగా తప్పని పరిస్థితుల్లో ఇందుకు ఒప్పుకున్నది కానీ.. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల కోణంలో మాత్రం కాదని అంటున్నారు. అలాంటిది, ఇప్పుడు కులగణన క్రెడిట్ను బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ”కులగణన విషయంలో మోడీ సర్కారు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ఏ ప్రభుత్వమూ జనగణన లో కులాలవారీగా లెక్కలు తీయలేదు” అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. వాస్తవానికి, అప్పటి యూపీఏ-2 హయాంలో 2011 జనాభా లెక్కల సందర్భంగా సామాజిక- ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ)ని నిర్వహించింది. 1931 తర్వాత ఇలాంటి గణన ఇదే తొలిసారి. అయితే, బీజేపీ నాయకులు మాత్రం ఆ విషయాన్ని మరచిపోయి ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు మాత్రం ఈ సమాచారానికి సంబంధించిన డేటాను బహిర్గతం చేయకపోవటం గమనార్హం.
ఓట్ల కోసం ఒప్పుకోక తప్పని పరిస్థితి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నితీశ్ కుమార్ ఎక్కడ దూరమవుతాడోనన్న భయం, లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి నిరంతర డిమాండ్.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు యూటర్న్ తీసుకొని కులగణనకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వాస్తవానికి హిందూత్వ పేరుతో ఓట్లను దండుకునే బీజేపీకి.. ఉన్నత కులాలు, వర్గాల నుంచే ఎక్కువ మద్దతు ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, పేదలలో ఆ పార్టీకి అంతగా పట్టు లేదు. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో యూపీ, మహారాష్ట్రల నుంచి కాషాయపార్టీ గణనీయమైన నస్టాన్ని ఎదుర్కొన్నది. యూపీలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ల కూటమి యాదవ, ఇతర ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను రాబట్టగలిగింది. ఇందుకు ఇండియా బ్లాక్ ఒక వ్యూహాత్మక ప్రచారంతో ముందుకెళ్లింది. విజయం సాధించింది. అయితే, బీహార్లో జరగనున్నది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదే వ్యూహంతో ఆర్జేడీ-కాంగ్రెస్లు ముందుకెళ్తే.. బీజేపీ-జేడీ(యూ)కు చెక్ పెట్టొచ్చు. కులగణనకు సై అన్నామన్న ఆ కూటమి చేసే ప్రచారాన్ని.. వాస్తవిక గణాంకాలు, అందుకు దారి తీసిన పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్తే బీహార్లో మహాఘట్బంధన్కు తిరుగుండదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
అప్పుడు నై.. ఇప్పుడు సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES