నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయటపెట్టారని, ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు. తన కుమారుడిని యూనివర్సిటీలో చేర్పించేందుకు తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో టీవీజీకేఎస్ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించారు. కాగా, టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు కవిత శుభాకాంక్షలు తెలపడం విశేషం.