నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీరామనవమి పర్వదినాన ఆకివీడులోని పెదపేట రామాలయం వద్ద ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ… తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు.
నిన్న సాయంత్రమే బయటి ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకివీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు వాళ్లు వచ్చారని ఆయన పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ రామాలయాన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వారు హిందువులే అయినప్పటికీ వేరే మతం ముసుగులో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. దాడి చేసిన వారు రామ భక్తుల వేషంలో ఉండి ఒక్కసారిగా విరుచుకుపడ్డారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని వెల్లడించారు. లేనిపక్షంలో పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు.
ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని రఘురామ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించానని, వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



