– ఆహారం కోసం వెళ్ళిన 17మందితో సహా 75మంది మృతి
– జర్నలిస్టుల మృతిని ఖండించిన ప్రపంచ దేశాలు
– జెరూసలేంలో నిరసనలు
గాజా, జెరూసలేం : గాజాలో సోమవారం నాజర్ ఆస్పత్రి లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందడంపై ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఇజ్రాయిల్ వైఖరిని ఖండించాయి. పాశవికమైన యుద్ధ నేరం ఇదని ఇరాన్, కెనడా, ఈజిప్ట్, సౌదీ అరేబియా సహా పలు దేశాలు తీవ్రంగా విమర్శించాయి. కాగా, గత 24గంటల్లో ఆకలితో మరో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. దీంతో కరువు బారిన పడి మరణించినవారి సంఖ్య 3030కి చేరింది. వీరిలో 117మంది అభం శుభం తెలియని చిన్నారులే కావడం విచారకరం. మరోవైపు ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల్లో 75మంది మరణించారు. వీరిలో 17మంది ఆహారం కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నవారేనని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని రమల్లా, ఎల్ బీరేV్ాలో ఇజ్రాయిల్ మిలటరీ సాగించిన దాడుల్లో 58మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.
గాజాలోని ప్రజానీకానికి అవసరమైన ఆహారంలో కనీసం 15శాతం కూడా అందడం లేదని గాజా మీడియా కార్యాలయం తెలిపింది. నెల రోజుల కాలంలో కేవలం 2654 ట్రక్కులు వచ్చాయని అంటే సగటున రోజుకు 88 ట్రక్కుల ఆహారం వస్తోందని, ఇది ప్రజల అవసరాలను ఏమాత్రమూ తీర్చడం లేదని పేర్కొంది. పైగా గర్భవతులు, పిల్లలకు అవసరమైన పోషకాలేవీ కూడా వారికి అందకుండా చేసి, వారిని మాడ్చి చంపే లక్ష్యంతో చికెన్, మటన్, చేపలు, గ్రుడ్లు, పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సహా పలు ఆహార పదార్ధాలపై ఇజ్రాయిల్ నిషేధాన్ని అమలు చేస్తోందని పేర్కొంది.
జెరూసలేంలో నిరసనలు
బందీలందరినీ విడిపించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ జెరూసలేంలో ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద మంగళవారం నిరసనలు జరిగాయి. ప్రధాని కార్యాలయంలో గాజాపై ఇజ్రాయిల్ భద్రతా క్యాబినెట్ సమావేశమై చర్చిస్తుండగా, వెలుపల ప్రజలు తమ నిరసన గళం వినిపించారు. హైవేపై వందలాదిగా టైర్లను దగ్ధం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఆకలికి మరో ముగ్గురు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES