Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంమూడు సంవత్సరాల ప్రాక్టీస్‌ తప్పనిసరి

మూడు సంవత్సరాల ప్రాక్టీస్‌ తప్పనిసరి

- Advertisement -

– న్యాయ సేవలల్లో ప్రవేశంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:
మున్సిఫ్‌ మెజిస్ట్రేట్లుగా జ్యుడీషియల్‌ సర్వీసులలో ఎంట్రీ లెవల్‌ జ్యుడీషియల్‌ పోస్టులకు దరఖాస్తు చేసే న్యాయవాదులు కనీసం మూడు సంవత్సరాల పాటు లీగల్‌ ప్రాక్టీస్‌ చేసి ఉండాలన్న నిబంధనను సుప్రీంకోర్టు మంగళవారం తిరిగి ప్రవేశపెట్టింది. న్యాయమూర్తులకు తగినంత ప్రాక్టికల్‌ అనుభవం లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ నిబంధనను 2002లో తొలగించారు. కొత్తగా న్యాయ శాస్త్ర పట్టా పుచ్చుకున్న వారిని ఎలాంటి ప్రాక్టికల్‌ అనుభవం లేకుండానే జ్యుడీషియల్‌ సర్వీసులలో అనుమతించడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవారు, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏజీ మసిV్‌ా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘సివిల్‌ జడ్జిల (జూనియర్‌ డివిజన్‌) పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారికి మూడు సంవత్సరాల కనీస ప్రాక్టీస్‌ అవసరమని మేము భావిస్తున్నాము. దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను సవరించాల్సి ఉంటుంది’ అని న్యాయస్థానం తెలిపింది. అభ్యర్థి లీగల్‌ ప్రాక్టీస్‌ అనుభవాన్ని బార్‌లో పది సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయవాది ధృవీకరించాలి. క్లర్కుగా పనిచేసిన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. జ్యుడీషియల్‌ సర్వీసులలో చేరే వారు జడ్జి స్థానంలో కూర్చోవడానికి ముందు సంవత్సరం పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ‘గత 20 సంవత్సరాలుగా బార్‌లో ఒక్క రోజు అనుభవం లేకపోయినప్పటికీ కొత్తగా వచ్చిన లా పట్టభద్రులను జ్యుడీషియల్‌ అధికారులుగా నియమించారు. వీరితో అనేక సమస్యలు వస్తున్నాయి’ అని బెంచ్‌ వివరించింది. అయితే ఈ నిబంధన భవిష్యత్‌ నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -