Thursday, June 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి

ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి

- Advertisement -

– నిజాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వద్ద ఘటన
– కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం
నవతెలంగాణ-నిజాంసాగర్‌

ఈతకు వెళ్లి.. ముగ్గురు యువకులు మృతిచెందిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బాన్సువాడ రూరల్‌ సీఐ రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన పదిమంది యువకులు సోమార్‌పేట్‌ సమీపంలో క్రికెట్‌ ఆడేందుకు సోమవారం వెళ్లారు. క్రికెట్‌ ఆడిన తర్వాత సేదతీరేందుకు మహమ్మద్‌నగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ లోతుకు వెళ్లిన ముగ్గురు యువకులు.. నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నిజాంసాగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్‌ గౌడ్‌(18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్‌ (25), సోమర్‌పేట్‌ గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌(17)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -