– సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: చిత్రాలను విడుదల చేసేందుకు నిర్మాతలు, థియేటర్ యజమానులకు గల హక్కులను హింస, దహనాల బెదిరింపులతో తగ్గించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కమల్ హాసన్ సినిమా థగ్ లైఫ్ను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేలా కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. ”అల్లరి మూకలు, నిఘా బృందాలు మన వీధులను ఆక్రమించుకోవడానికి మనం అనుమతించరాదు. చట్టబద్ధ పాలన అమలు జరగాలి.” అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. థగ్లైఫ్ చిత్రాన్ని కర్నాటకలో కూడా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరు వాసి మహేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వెకేషన్ బెంచ్ విచారించి పై ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లపై, చలన చిత్ర నిర్మాతలపై హింసను రెచ్చగొట్టిన, బెదిరింపులు చేసిన శక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్దారుడు కోరారు. చిత్ర ప్రమోషన్ సందర్భంగా కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చిత్రంపై నిషేధం విధించారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే, మీరు కూడా ప్రతిగా స్టేట్మెంట్తో సమాధానం ఇవ్వండి, ఎవరైనా రాస్తే, అందుకు ప్రతిగా రాతతో బదులివ్వండి. అంతేకాని హింస, బెదిరింపులు, దహనాలు వంటి చర్యలకు దిగరాదు.” అని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు. కర్నాణక హైకోర్టులో కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ సుప్రీం కోర్టు బదిలీ చేసింది. కమల్ హాసన్ చేసిన ప్రకటనకు గానూ ఆయనను క్షమాపణలు అడిగే అవసరం హైకోర్టుకు లేదని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తన స్పందనను బుధవారానికి తెలియచేయాల్సిందిగా కర్నాటక ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. గురువారానికి విచారణను వాయిదా వేసింది.
కర్నాటకలో థగ్లైఫ్ విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -