నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రొకబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ అద్భుత ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో పోరాడి ఓడింది. పుణెరి పల్టాన్ చేతిలో 50-45తో టైటాన్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. విజయం సాధించిన పల్టాన్ ఫైనల్కు చేరుకుంది. ఇక టైటిల్ పోరు కోసం శుక్రవారం దబంగ్ ఢిల్లీని పల్టాన్ ఢీకొంటుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన తెలుగు టైటాన్స్ పీకేఎల్ 2025లో మాత్రం అద్భుతంగా ఆడింది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. మంచి ప్రదర్శనతో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. అయితే క్వాలిఫయర్-2లో ఒత్తిడి చిత్తయింది. మ్యాచ్ ఆరంభంలో పుణెరి పల్టాన్ దూకుడుగా ఆడింది. దాంతో టైటాన్స్ 1-10తో వెనుకబడింది. మ్యాచ్ ఏకపక్షం అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ టైటాన్స్ పుంజుకుని రేసులోకి వచ్చింది. భరత్ హుడా రాణించడంతో బ్రేక్ సమయానికి 24-20తో ఆధిక్యంను తగ్గించింది.
ద్వితీయార్ధంలో తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించేలా కనిపించింది. ఆదిత్య షిండే, పంకజ్ మోహితే రాణించడంతో పుణెరి పల్టాన్కు తిరుగులేకుండా పోయింది. భరత్ హుడాపోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 5 పాయింట్స్ తేడాతో పల్టాన్ విజయం సాధించిది. టైటాన్స్ తరఫున భరత్ 22, విజయ్ మలిక్ 11 పాయింట్స్ చేశారు. పల్టాన్ తరఫున ఆదిత్య 21 పాయింట్లు చేయగా.. పంకజ్ 10 పాయింట్లతో మెరిశాడు. ఆరంభమే టైటాన్స్ కొంపముంచింది. మంచి ఆరంభం దక్కితే టైటాన్స్ ఫైనల్ చేరేదే.

 
                                    