కర్నూలు : వక్ఫ్ భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు, జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా విమర్శించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన కర్నూలు మెరీడియన్ ఫంక్షన్ హాల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్కడ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు మెరీడియన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు జలీసా సుల్తానా యాసీన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల, డాక్టర్ కుద్దుసా, జమాతే ఇస్లామియా ఎ హింద్ జిల్లా సభ్యులు నాశిర ఖానం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను చేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తోందన్నారు. అందులో భాగంగానే వక్ఫ్ Ûసవరణ చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లిముల మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, గుర్తింపును బలహీన పరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మైనార్టీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నల్ల చట్టం రద్దయ్యే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.అలివేలు, జిల్లా నాయకులు, మహిళలు పెద్ద సం.ఖ్యలో పాల్గొన్నారు.