నవతెలంగాణ-ఎల్బీనగర్:కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ జూన్17న(నేడు) ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, సరూర్ నగర్ మండల కార్యదర్శి బాతరాజు నర్సింహ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్లు పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా గోడపత్రికను వారు ముఖ్య అతిథులుగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులను ఏరివేత పేరుతో చంపుతాం అని బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. చర్చలు జరపడానికి సిద్ధం అని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.ఇతర దేశాలతో చర్చలు జరపడానికి సిద్దమైన ప్రభుత్వం, సొంత పౌరులతో చర్చలు జరపకపోవడం బీజేపీ దుర్నితిని తెలియజేస్తున్నదన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అంతంచేయడానికి, ఖనిజాలను అడవులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి పూనుకున్నారన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఆపరేషన్ కగార్ను ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎండీ ఫైమీద, సీపీఐ సరూర్ నగర్ మండల సహాయ కార్యదర్శి బోయపల్లి రాములు గౌడ్, నాయకులు లింగయ్య గౌడ్, యాదయ్య, నర్సింగ్, నాగరాజు, ఎల్లయ్య, మదిలేటి, పురుషోత్తం, శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.