నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక సూచనలు చేశారు.
వరద తీవ్రత ఎక్కువగా ఉన్న పలు జిల్లాల పార్టీ నేతలతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచి, అవసరమైన సహాయాన్ని అందించేందుకు పార్టీ శ్రేణులను వెంటనే రంగంలోకి దించాలని కేటీఆర్కు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం సహా అనేక జిల్లాల్లో వరదల కారణంగా నివాస ప్రాంతాలు నీట మునగడం, రహదారులు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు, చెరువుల నుంచి నీరు పోటెత్తడంతో వందలాది ఎకరాల్లో పంటలు నాశనమై ఇసుక మేటలు వేశాయని, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, రాష్ట్రంలో నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.