– మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ సీరియస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలపై సమాచార, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి చేసిన ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయటాన్ని ఆయన తప్పుపట్టినట్టు సమాచారం. క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మాట్లాడటం, అందులోనూ ఇతర మంత్రికి చెందిన శాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం ఏంటని మహేశ్కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దని సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలనీ సున్నిత అంశాలను, కోర్టు పరిధిలోని అంశాలను మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే బీసీ సంఘాల డిమాండ్, కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్టలో పడేసినట్టేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి విమర్శలు రావడానికి పొంగులేటి ప్రకటన దారి తీసిందని పార్టీలో పీసీసీ నేత దృష్టికి కొంత మంది నాయకులు తీసుకెళ్లినట్టు తెలిసింది.
అలా మాట్లాడితే ఎలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES