నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల కాలంలో డ్రైనేజ్, ఇతర వ్యర్థాల ట్యాంకులు, బావులు క్లీన్ చేసే సమయంలో విషవాయువు కారణంగా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో కేరళలోని కట్టప్పనలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టప్పనలోని ఆరెంజ్ హోటల్ వ్యర్థాల ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుండగా తమిళనాడుకు చెందిన ముగ్గురు కార్మికులు విషవాయువుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుంబంకు చెందిన జయరామన్, గూడలూరుకు చెందిన సుందర పాండియన్, మైఖేల్గా గుర్తించారు.
నివేదికల ప్రకారం, ఒక కార్మికుడు మొదట వాగు సమీపంలోని వ్యర్థాల గుంతలోని మ్యాన్హోల్లోకి దిగి శుభ్రం చేస్తుండగా అతను అందులోనే చిక్కుకుకుపోయాడు. అతన్ని రక్షించే ప్రయత్నంలో, మిగిలిన ఇద్దరు కూడా అతని వెంట వెళ్లారు. కానీ ముగ్గురూ లోపలే చిక్కుకున్నారు. ట్యాంక్ లోపల ఆక్సిజన్ లేకపోవడం వల్లే వారి మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం అక్కడ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.