నవతెలంగాణ – హైదరాబాద్: చరిత్ర, వారసత్వం దైనందిన జీవితంలో మమేకమైన నగరంలో… ప్రిన్స్ ఆజం జా కేవలం ఒక హోదా లేదా సంప్రదాయానికి ప్రతినిధిగా కాకుండా, న్యాయం కోరుకునే ఒక కుమారుడిగా, తాను ఎంతో అమితంగా ప్రేమించే వారసత్వ సంపదకు సంరక్షకుడిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ 8వ నిజాం కీర్తిశేషులు హెచ్.ఇ.హెచ్. మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరం జా బహదూర్ కుమారుడైన ప్రిన్స్ ఆజం జా.. ‘ముకరం జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్’ (MJTEL)లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ద్వారా స్వయంగా ఈ ట్రస్ట్లో నియమితులైన ఆయన.. తన పాత్రను ఎప్పుడూ ఒక విశేషాధికారంగా భావించలేదు. దాన్ని ఒక బాధ్యతగా.. తన తండ్రి ఆశయాలైన విద్యా, సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధిగా పరిగణించారు.
ఈ నేపథ్యంలోనే, తనను ట్రస్ట్ నుంచి తొలగిస్తూ ఇచ్చిన నోటీసు విధానాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ నోటీసుపై పాత తేదీ ఉన్నప్పటికీ.. స్పందించడానికి గడువు ముగుస్తుందనగా కేవలం కొద్ది రోజుల ముందు మాత్రమే దానిని అందజేశారు. దీనివల్ల తన వాదనను వినిపించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ప్రిన్స్ ఆజం జా దృష్టిలో.. ఇది కేవలం ఒక విధానపరమైన లోపం మాత్రమే కాదు, పారదర్శకత, న్యాయం మరియు సరైన చట్టపరమైన ప్రక్రియల అమలుపై అనుమానాలను రేకెత్తిస్తున్న సైద్ధాంతిక సమస్య.
ప్రిన్స్ ఆజం జా ఎప్పుడూ ఘర్షణను కాకుండా స్పష్టతను కోరుకునే వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కుటుంబం మరియు ట్రస్ట్కు సంబంధించిన విషయాల్లో ఆయన ఇటీవల తీసుకున్న చట్టపరమైన చర్యలు.. ఎవరిపైనా శత్రుత్వంతో చేసినవి కావని, ప్రజల నమ్మకం మీద నిర్మితమైన సంస్థలు జవాబుదారీతనంతో, నిజాయితీతో పనిచేసేలా చూసేందుకు చేసిన ప్రయత్నాలేనని ఆయన స్పష్టం చేశారు. సరైన విధానాలను, చట్టబద్ధతను కాపాడటమే.. అంతిమంగా తన తండ్రి కష్టపడి నిర్మించిన వారసత్వాన్ని రక్షించగలదని ఆయన విశ్వసిస్తున్నారు.
1971లో రాజరిక బిరుదుల రద్దుతో ఇటువంటి అంశాలన్నీ పూర్తిగా భారతీయ చట్టాల పరిధిలోకి వచ్చాయనే ఒక సాధారణ మరియు ముఖ్యమైన చట్టపరమైన నిజాన్ని ప్రిన్స్ ఆజం జా పునరుద్ఘాటించారు. నేటి నాయకత్వం కేవలం ప్రతీకల మీద కాకుండా.. చట్టబద్ధత మరియు పారదర్శక పాలనపై ఆధారపడి ఉండాలి. ఆయనకు ఇది హోదా కు సంబంధించిన ప్రశ్న కాదు, సూత్రాలకు సంబంధించిన విషయం.
బహిరంగంగా మాట్లాడటం ద్వారా.. ప్రిన్స్ ఆజం జా ఎవరి సానుభూతిని గానీ, ప్రచారాన్ని గానీ ఆశించడం లేదు. బదులుగా, ఆయన ప్రశాంతమైన ఆలోచన, సంస్థాగత న్యాయం మరియు సరైన చట్టపరమైన ప్రక్రియలపై గౌరవాన్ని కోరుతున్నారు. ప్రస్తుత వివాదాల పరిష్కారానికి.. చర్చలు, చట్టబద్ధత మరియు పారదర్శకత మార్గనిర్దేశం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, తన ఉద్దేశం విభజన తీసుకురావడం కాదని.. సంస్థలకు, వారసత్వానికి మరియు హైదరాబాద్ ప్రజలకు తగిన గౌరవం, ప్రతిష్ట దక్కాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.



