నేడు భారత్, శ్రీలంక ఢీ
కొలంబో (శ్రీలంక) : ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్కప్ ముంగిట ఆతిథ్య భారత్ సహా శ్రీలంక, దక్షిణాఫ్రికా ముక్కోణపు సమరానికి సై అంటున్నాయి. మెగా సవాల్ను ఎదుర్కొనే ముందు.. ముక్కోణపు సమరంలో బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ సమతూకం సాధించేందుకు అన్ని జట్లు ఎదురుచూస్తున్నాయి. వెస్టిండీస్, ఐర్లాండ్పై వరుసగా ఆరు వన్డేల్లో విజయాలు సాధించిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. ముక్కోణపు వన్డే సిరీస్లో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. సిరీస్ ఆరంభ మ్యాచ్లో నేడు ఆతిథ్య శ్రీలంకతో భారత్ తలపడనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సిరీస్లోని అన్ని మ్యాచులకు వేదికగా నిలువనుంది.
బౌలింగ్ కూర్పు కుదిరేనా? :
భారత్కు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు లేవు. షెఫాలీ వర్మను మరోసారి మొండిచెయ్యి ఇవ్వగా.. కెప్టెన్ హర్మత్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, పవర్ హిట్లర్ రిచా ఘోష్ సహా జెమీమా రొడ్రిగస్, హర్లీన్ డియోల్తో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, ఆమన్జోత్ కౌర్లు బ్యాట్తోనూ మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలరు. కానీ టీమ్ ఇండియా ఆందోళ అంతా బౌలింగ్ విభాగంపైనే. టిటాస్ సాధు, రేణుక సింగ్, పూజ వస్ట్రాకర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డిపైనే పేస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఆల్రౌండర్ ఆమన్జోత్ మాత్రమే జట్టులోని మరో పేస్ బౌలర్. ప్రేమదాస స్టేడియం సహజంగా స్పిన్కు స్వర్గధామం. ఇక్కడ స్లో బౌలర్లకు సక్సెస్ ఎక్కువ. స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేV్ా రానా సహా యువ స్పిన్నర్ శ్రీ చరణిలు భారత్కు కీలకం కానున్నారు. 50 ఓవర్లలో 30 ఓవర్లు స్పిన్నర్లు సంధించనున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సైతం ఆఫ్ స్పిన్తో మాయ చేయగలదు. మరోవైపు శ్రీలంక శిబిరంలోనూ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. శ్రీలంక జట్టులో ఆరుగురు కొత్త ముఖాలు ఉండగా.. నలుగురు నేడు అరంగ్రేటం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇరు జట్ల స్పిన్నర్ల ప్రదర్శనే విజేతను తేల్చనుందని చెప్పవచ్చు.
ముక్కోణపు సమరం
- Advertisement -