నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ‘‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’’ అని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు.
మరోవైపు గోల్డ్కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.