నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై బెదిరింపులకు దిగారు. రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై టారిఫ్లను విధించేందుకు సిద్ధమయ్యారు. ద్వైపాక్షిక రష్యా ఆంక్షల బిల్లుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేసినందుకు వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనా, బ్రెజిల్లపై జరిమానా విధించేందుకు ఈ బిల్లును వినియోగించనున్నారు. గ్రాహం-బ్లూమెంటల్ బిల్లు ఆమోదం పొందితే, రష్యా చమురు లేదా యురేనియంను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అనుమతి లభిస్తుంది. బుధవారం వైట్హౌస్లో అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యానని గ్రాహం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ నెలల తరబడి చర్చిస్తున్న బిల్లుకు తన మద్దతు తెలిపారని అన్నారు. వైట్హౌస్ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ధృవీకరించారు. వచ్చే వారం ప్రారంభంలో ఓటింగ్ జరగవచ్చని గ్రాహం అన్నారు. ఈ బిల్లుని హౌస్ ఆమోదిస్తే, ప్రస్తుతం పరిశీలిస్తున్న స్కేల్-బ్యాక్డ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీని వచ్చే వారం సెనెట్ చేపట్టనుంది.
రష్యా ఆంక్షల బిల్లు
గ్రాహం మరియు డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటల్ ప్రధానంగా ఈ బిల్లును రూపొందించారు. రష్యా చమురు, గ్యాస్, యురేనియం మరియు ఇతర ఎగుమతులను కొనుగోలు చేసే దేశాలపై 500శాతం వరకు సుంకాలు మరియు ద్వితీయ ఆంక్షలను విధించేందుకు ట్రంప్యంత్రాంగాన్ని అనుమతిస్తుంది. అంటే రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి విధించేందుకు రూపొందించింది. గతంలో ఈ బిల్లులో కొన్ని సవరణలు చేపట్టాలని వైట్హౌస్ సూచించింది.



