జూన్ ఒకటవ తేదీన రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడి గురించి ఐదవ తేదీన ఇది రాసిన సమయానికి కూడా అమెరికా అధిపత డ్రోనాల్డ్ ట్రంప్ నోరు విప్పలేదు.ఇదొక ప్రపంచ వింత అనుకోవచ్చు. అయితే ట్రంపేమీ చెప్పలేదా అంటే నాలుగవ తేదీన తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా స్పందించాడు. అది రేడియో లాంటిదే మనం వినటం తప్ప అడగటానికి ఉండదు.ఇంతకీ ట్రంప్ చెప్పిందేమిటి ! ఉక్రెయిన్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ గట్టిగా స్పష్టం చేశాడట. ఇన్ని రోజుల తరువాత ట్రంప్ వెల్లడించాల్సినంత గొప్ప రహస్యమా ఇది. దాడి జరిగిన మరుక్షణం నుంచి ప్రపంచమంతా అనుకుంటున్నదే. ఎప్పుడు, ఎలా అన్నది తెలియదు. ఈ ఉదంతం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. పద్దెనిమిది నెలల పాటు పథకాన్ని రూపొందించామని జెలెన్స్కీ చెప్పాడు. సరే, రష్యా గ్రహించలేక పోయింది, అంతకంటే గొప్ప నిఘా తమది అని చెప్పుకొనే సిఐఏ ఎందుకు పసిగట్టలేక పోయినట్టు? దాడి గురించి ఉక్రెయిన్ మాకు ముందుగా చెప్పలేదని అధ్యక్ష భవనం చెప్పింది. అంటే జెలెన్స్కీ అమెరికాను నమ్మటం లేదని, ఇతర ఐరోపా దేశాలన్నీ కలసి అమెరికాను పక్కన పెట్టి ఈ దాడికి పథకం వేశాయని అనుకోవాలి. అంటే ట్రంప్ను పిచ్చిపుల్లయ్యను చేసినట్లే! ఉక్రెయిన్ దాడి ప్రపంచ మిలిటరీ వ్యూహాల్లో కొత్త ఎత్తుగడలకు తెరతీసిందని చెప్పవచ్చు.ఇప్పటికే పలుచోట్ల డ్రోన్ల దాడులు జరుగుతున్నప్పటికీ జూన్ ఒకటిన రష్యా మీద జరిగినదాడి కొత్త మలుపు తిప్పింది. రక్షణ చర్యలను సమీక్షించు కోవాల్సిన అగత్యాన్ని తెచ్చిపెట్టింది. పెద్ద క్షిపణులు, విమానాలే కాదు చిన్న చిన్నడ్రోన్లు కూడా ఎంతటి నష్టాన్ని కలిగిం చగలవో స్పష్టమైంది. ప్రత్యర్ధి చిన్నవాడని నిర్లక్ష్యం చేయకూడదన్నది పెద్ద గుణపాఠం.
తాడిని తన్నేవాడుంటే వాడిని తలదన్నేవాడుంటాడన్నది లోకోక్తి. రష్యాకూ అదే వర్తిస్తుంది. అలా అనుకుంటే పెరల్ హార్బర్ మీద రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దాడిని అమెరికా పసిగట్టలేకపోయింది. ఇప్పుడు రష్యా పొందిన నష్టం కంటే అది చాలా పెద్దది. అంతెందుకు చీమచిటుక్కుమంటే పసిగట్టే అమెరికా ఎంబసీల రహస్య వర్తమానాలను జూలియన్ అసాంజే బృందం లక్షలాది ఫైళ్లను బయటపెట్టటాన్ని అమెరికా నివారించలేకపోయింది. గాజా చుట్టూ ఎత్తైన ఇనుప కంచె, దాని మీద 24 గంటలూ నిఘా కెమెరాలు, సెన్సర్లు ఉన్నప్పటికీ హమాస్ సాయుధులు దాన్ని ఒకచోట బుల్డోజర్లతో కూల్చివేసి ఇజ్రాయిల్ గడ్ద మీద ప్రవేశించి కాల్పులు జరిపి అనేక మందిని హతమార్చిన ఉదంతం ఎలా జరిగిందన్నది ఇప్పటికీ బయటిలోకానికి తెలియదు.దానికి ప్రతిగా వేలాది మందిని చంపటం, గాజాను సర్వనాశనం చేయటం తప్ప హమాస్ సాయుధులను ఇజ్రాయిల్ పట్టుకోలేకపోయింది. మనదేశం అణుపరీక్ష చేసి లోకానికి తెలియచేసేంతవరకు అమెరికా పసిగట్టలేకపోయిన సంగతి వేరే చెప్పనవసరం లేదు.
బుధవారం నాడు పుతిన్తో గంటకు పైగా సంభాషించినట్లు, మాటలు మంచిగా నడిచినట్లు ట్రంప్ చెప్పాడు. అయితే తమ సంభాషణ తక్షణమే శాంతికి దోహదం చేసేదిగా లేదని కూడా అన్నాడు. మరి సంభాషణలో కనిపించిన మంచేమిటి ? మరోవైపున ఉక్రెయిన్ మరిన్ని ఆయుధాల తయారీ, కొనుగోలుకు అవసరమైన నిధులు ఇస్తామని ఐరోపా మిత్రదేశాలన్నీ నిర్ణయించినట్లు వార్తలు, దాని మీద ట్రంప్ ఎందుకు మాట్లాడనట్లు? రష్యా తమ నగరాలపై వైమానిక, క్షిపణి దాడులు చేస్తే తట్టుకునేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థలు అంటే పేట్రియాట్ లేదా అలాంటివి కావాలని బ్రసెల్స్లో సమావేశమైన నాటో ప్రతినిధులను జెలెన్స్కీ కోరాడు. తమకు తక్షణమే 46 బిలియన్ డాలర్లు కావాలని గతంలో విన్నవించుకున్నాడు. రోజుకు మూడు వందల డ్రోన్ల చొప్పున రష్యా ప్రయోగిస్తోందని, ఈ ఏడాది చివరివరకు ప్రయోగించే నిల్వలు దాని దగ్గర ఉన్నాయని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలే అన్నాడు. ఉక్రెయిన్ దాడితో రష్యా బల హీనతలు వెల్లడైనందున శాంతి చర్చల్లో దానికి బేరమాడే శక్తి తగ్గిందని ఇలా రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ కాక్షేపానికి బాగాపనికి వస్తాయి తప్ప వాస్తవ పరిస్థితిని పెద్దగా ప్రభావితం చేసేవి కాదు. అమెరికాను పక్కన పెట్టి నిజంగా ఐరోపా దేశాలు ఉక్రెయిన్ను ఎగదోస్తే అది తాత్కాలికం, అమెరికాను హెచ్చరించేందుకే తప్ప దాన్ని పూర్తిగా విస్మరించే స్థితిలో ఐరోపా లేదు. ట్రంప్, ఇతర అమెరికా నేతలు మాట్లాడిన మాటలు ఐరోపా సమాఖ్య నేతలను ఇరు కున పెట్టాయి. ట్రంప్ స్పందన తర్వాతే పుతిన్ కార్యాచరణ ఉంటుందని కొందరు చెప్పారు. అప్పటి వరకు ఆగేంత అ మాయకంగా రష్యన్లు ఉండరు. మౌనం ఒక ఎత్తుగడ మాత్రమే, ఏ రూపంలో ప్రతి దాడులుంటాయో, వాటిని జెలెన్స్కీ అనేకంటే అతగాడి వెనుక ఉండి ఎగదోస్తున్న నాటో దేశాలు ఎలా ఎదుర్కొంటాయన్నదే ఆసక్తి కలిగించే అంశం!
నోరు విప్పని ట్రంప్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES