నవతెలంగాణ-హైదరాబాద్: ఇరానీయన్లందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వాయుధ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించిందని పేర్కొన్నారు. ”నేను సూచించిన ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాలి. ఎంత అవమానకరం. మానవ జీవితాలను పణంగా పెట్టడం. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు. అందరూ వెంటనే ఇరాన్ను ఖాళీ చేయాలి” అని ట్రంప్ తన సోషల్మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కెనడాలో జరుగుతున్న జి7 సదస్సు నుండి ట్రంప్ ఒకరోజు ముందే వీడనున్నట్లు వైట్హౌస్ పేర్కొంది. జాతీయ భద్రతా మండలి సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ఇజ్రాయిల్ మరియు ఇరాన్లను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడమే ప్రధాన లక్ష్యమైనందున ట్రంప్ ముందస్తు నిష్క్రమణ సరైనదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు.
ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ఐదవరోజైన మంగళవారం కూడా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లో భారీ వైమానిక, రక్షణ కాల్పులు జరిగాయని ఇరాన్ మీడియా ప్రకటించింది.320 కి.మీ దూరంలో ఉన్న కీలకమైన అణుస్థావరాలకు కేంద్రమైన నాటాంజ్లో కూడా వైమానిక దాడులు జరిగినట్లు తెలిపింది. ఐదురోజుల దాడుల్లో 224 మంది మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారని ఇరాన్ ప్రకటించగా, 24 మంది పౌరులు మరణించారని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇరాన్ దాడుల కారణంగా సుమారు 3,000మంది ఇజ్రాయిలీలను ఖాళీ చేయించినట్లు ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ పేర్కొన్నారు.