నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాలో అత్యంత శక్తివంతమైన భూకంపం తర్వాత పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పసిఫిక్ మహాసముద్రం అంతటా అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అలలు అలస్కా ఉత్తర భాగాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. సునామీ అలలు ఇప్పటికే తీర ప్రాంతాలను తాకడం ప్రారంభించాయని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (పిటిడబ్ల్యుసి) ధృవీకరించింది. ప్రస్తుతం హవాయిలో ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో 4 అడుగుల ఎత్తులో అలలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుమారు 12 నిమిషాల వ్యవధిలో అలలు వచ్చాయని అన్నారు. పది అడుగుల వరకు అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ సమీపంలోని తీరంలో (స్థానిక సమయం 3.17గంటలకు) 8.8తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన పది అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) పేర్కొంది. భూకంపం తర్వాత వరుసగా బలమైన ప్రకంపనలు వచ్చాయని, వాటిలో ఒకటి రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో నమోదైందని అన్నారు.