నవతెలంగాణ – హైదరాబాద్: రాజారఘువంశీ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాకొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాతనే తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి సోనమ్ భర్త హత్యకు కుట్రపన్నిందని భావిస్తుండగా.. పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర జరిగిందని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందే వారి వివాహం నిశ్చయమైంది.
ఈ క్రమంలో ఫిబ్రవరిలో అంటే సుమారుగా పెళ్లికి మూడు నెలల ముందే తన ప్రియుడు రాజ్కుశ్వాహతో కలిసి సోనమ్.. కాబోయే భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్రపన్నినట్లు విచారణలో తేలింది. ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజా రఘువంశీని పెళ్లిచేసుకుని హత్యచేస్తే.. విధవరాలైన తనను ప్రియుడికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తారని సోనమ్ భావించింది.
పోలీసుల విచారణలో సోనమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ హత్య చేస్తే కటకటాలపాలై జీవితం సర్వనాశనం అవుతుందనే విషయాన్ని మాత్రం సోనమ్, ఆమె ప్రియుడు రాజ్కుశ్వాహాలు ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం. కాగా మే 11న రాజా, సోనమ్ల వివాహం జరగగా మే 23న రాజారఘువంశీ హత్యకు గురయ్యాడు. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ సోనమ్ హత్య చేయించింది.