నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లో జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలు రెండో రోజు సందడిగా మొదలయ్యింది.. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన ఆవశ్యకతపై మాజీ ఐద్వా అధ్యక్షురాలు, మాజీ ఎంపి మాలిని భట్టాచార్య ప్రసంగంతో ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా మాలిని భట్టాచార్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐద్వా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా, ప్రతినిధులందరూ రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. కేరళ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు, పది మంది ఎంపిక చేసిన మహిళా కళాకారుల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ‘ఐలమ్మ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను ప్రారంభించారు.
అనంతరం ప్రతినిధుల సభలో రాజకీయ పరిణామాలపై జాతీయ, అంతర్జాతీయ నివేదికను ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టారు. ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిస్థితి, భారతదేశంలో పెరుగుతున్న కార్పొరేట్-హిందుత్వ శక్తుల దాడులపై ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది. మోడి ప్రభుత్వం ప్రపంచ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు లంగిపోవడాన్ని ఇది ఎండగట్టింది. మోడి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఓటు హక్కు, పని, ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం, విద్య వంటి హక్కులపై జరుగుతున్న దాడులను కూడా ఈ నివేదిక విశ్లేషించింది. నివేదికలోని పలు అంశాలపై వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. రేషన్ సమస్యలు, మైక్రోఫైనాన్స్ సంస్థలకు, వ్యతిరేక పోరాటం, మహిళలపై హింస, భూ ఆక్రమణలు మరియు మోడి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విధానాల వైఫల్యం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. మితవాద విధానాలను తాము ఎలా ఎదుర్కొన్నారో, పోరాటాలను ఎలా నిర్మించారో మహిళలు వివరించారు.
నాలుగు తీర్మానాలను ఆమోదం
– సామ్రాజ్యవాద మారణహోమానికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావం.
– వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను ఖండించింది..
– మతతత్వం, మహిళలపై దాని ప్రభావానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
– లోపభూయిష్టమైన ఎస్ఐఆర్ విధానాన్ని వ్యతిరేకించడం.





