నవతెలంగాణ-హైదారాబాద్: ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ల భేటీ ముగిసింది. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. రెండున్నర గంటలపైగా ఈ భేటీ సాగింది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. భేటీ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.
పుతిన్ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.