నవతెలంగాణ – అశ్వారావుపేట
జులై 2 తర్వాత పోలింగ్ కేంద్రాల పునర్విభజన తదితర అంశాలు పై కార్యాచరణ చేపట్టాలని 118 – అశ్వారావుపేట(యస్.టి.) నియోజక వర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.వేణుగోపాల్ అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో శనివారం నియోజక వర్గం లోని అయిదు మండలాల తహశీల్దార్లు, మాస్టర్ ట్రైనర్ లతో తన అద్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 2 వ తేదీ తరువాత నియోజక వర్గం వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు(బీ.ఎల్.ఓ )లకు వారి విధులపై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ లో భాగంగా 1200 మంది ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగు సర్దుబాట్లు చేయడం లేదా అవసరం ఉన్న చోట కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయాలపై తహశీల్దార్ లకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపు రెడ్డి పల్లి,చండ్రుగొండ తహశీల్దార్లు సీ హెచ్ వి. రామకృష్ణ,గన్యా నాయక్,పుల్లారావు,బి. సంధ్యారాణి,ఎన్నికల నాయబ్ తహశీల్దార్ యస్.డి హుస్సేన్, నియోజకవర్గానికి కేటాయించిన మాస్టర్ ట్రైనర్ లు పాల్గొన్నారు.