– నెరవేరని తయారీ లక్ష్యం
– మోడీ మేక్ ఇన్ ఇండియాకు బీటలు
న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగానికి ఊతం ఇవ్వడానికి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఫలించలేదు. 2020లో 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) అంచనాతో ఈ పథకాన్ని గొప్పగా ప్రకటించింది. పారిశ్రామిక వర్గాలకు భారీ ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే భారత్ను తయారీ హబ్గా మార్చాలని నిర్దేశించుకుంది. మొత్తం జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఉన్నది పెరగక పోగా.. మరింత తగ్గిందని రిపోర్టులు వస్తోన్నాయి. పీఎల్ఐ ప్రకటించిన ఐదేండ్ల తర్వాత జీడీపీలో 15.4 శాతంగా ఉన్న తయారీ వాటా ఇటీవల 14.3 శాతానికి పరిమితం అయ్యిందని అంచనా. మొత్తం ఉత్పత్తి లక్ష్యంలో కేవలం 37 శాతాన్ని చేరగా.. ప్రోత్సాహకాల్లో కేవలం 8 శాతం మాత్రమే పారిశ్రామికవర్గాలకు చేరింది. ఈ పరిణామాలను పరిశీలిస్తే మేక్ ఇన్ ఇండియా విఫలమయ్యిందని స్పష్టమవుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఇది మోడీ సర్కార్ విధానపరమైన లోపమనే విమర్శలు పెరుగుతున్నాయి. భారత్ కంటే చిన్న దేశమైన వియత్నం గతేడాది అనుసరించిన నూతన విధానాలు, నమ్మకమైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఏకంగా 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను ఆకర్షించింది. సమన్వయ విధానం, భారీ నైపుణ్యాల పెట్టుబడి ద్వారా చైనాలోని పెర్ల్ రివర్ డెల్టా ప్రాంతం రెండు దశాబ్దాల్లోనే ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది. స్థిరమైన విధాన మద్దతు ద్వారా బంగ్లాదేశ్ కూడా వస్త్ర తయారీలో భారత్లో అధిగమించిందని రిపోర్టులు వస్తోన్నాయి. భారత్ మాత్రం పారిశ్రామిక రంగంలో వెనుకబడిపోతోంది. పీఎల్ఐ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలను పెంచాలని భావించిన కేంద్రం వాగ్దానం నిలువలేకపో యింది. మొబైల్ తయారీలో, అంచనా వేసిన ఉపాధిలో నాలుగు శాతం మాత్రమే సాకారం అయ్యిందని అంచనా. ఫార్మా కంపెనీలు ప్రోత్సాహకాలను జేబులో వేసుకుని, ఆశించిన ఉద్యోగాలలో కేవలం 13 శాతం ఉద్యోగాలను మాత్రమే సృష్టించాయి. ఆపిల్ లాంటి కంపెనీలు తమ ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేసినప్పటికీ 85 శాతం పరికరాలు చైనా నుంచే రావడం గమనార్హం. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా ఎగుమతుల్లో వృద్ధిని సాధించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఈ పరిణామాలతో పిఎల్ఐ స్కీమ్ కార్పొరేట్ సంక్షేమంగా మారిందనే విమర్శలను మూటగట్టుకుంటుంది. తయారీ పుంజుకోవడం సబ్సిడీలపై మాత్రమే కాకుండా, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన పాలన, పర్యావరణ వ్యవస్థలు, ప్రజల కొనుగోలు శక్తిపై నిర్మించబడతాయని బీజేపీ పాలకులు, విధానకర్తలు మర్చిపోయినట్టు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫలించని పీఎల్ఐ వాగ్దానం
- Advertisement -
- Advertisement -