నవతెలంగాణ-హైదరాబాద్: శాంతి చర్చలు జరపాలని మావోయిష్టుల కేంద్ర కమిటీ పలుమార్లు కేంద్రం, ఛత్తీస్గడ్ ప్రభుత్వాలకు పలుమార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మావోయిష్టుల పట్ల కేంద్ర వైఖరిని వామపక్షలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, పలు పౌర సంఘాలు కూడా ఖండించాయి. అయినా కానీ దున్నపోతు మీద వర్షంపడ్డ చందంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మావోయిష్టుల శాంతి చర్చలపై కేంద్ర హోం మంత్రి స్పందించకుండా కాలాయాపన చేస్తున్నారని రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. ఈక్రమంలో నిజామాబాద్ పర్యటనలో ఆపరేషన్ కగార్ పై మరోసారి అమిత్ షా బీరాలు పలికారు.
ఆపరేషన్ కగార్ ఆపేది లేదని, మావోయిస్టులు హత్యాకాండ వదిలి రావాలని సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని, 2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ ను స్థాపించి తీరుతాం అన్నారు. నేడు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కిసాన్ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ నోట పాకిస్తాన్ జపం ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయంఅని తెలుస్తోందన్నారు.