– ఘనంగా ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం : టీజీఎస్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని కంచన్బాగ్వద్ద గల మిధాని తండాలో సంఘం నాయకుడు రామ్కుమార్ అధ్యక్షతన ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ ఎగురవేశారు. అనంతరం శ్రీరాంనాయక్ మాట్లాడుతూ ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవ స్పూర్తితో వాటిని కాపాడుకునేందుకు గిరిజన తెగలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి గిరిజన తెగలు తమ హక్కుల కోసం గళమెత్తాలని 1994లో ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. కానీ.. పాలకులు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. వారిలో ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామిచ్చిన హామీలపై ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రభుత్వాలు పలు రకాల పన్నాగాలు పన్నుతున్నాయని తెలిపారు. తరతరాలుగా గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతి, భాష, ఆచారాలపై ఇతర మతాల ప్రభావం పడుతోందనీ, తద్వారా అవి ఉనికి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2027లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాభా లెక్కల పత్రంలో మతం అనే కాలంలో షెడ్యూల్డ్ తెగలు లేదా ప్రకృతి ఆరాధికులు అనే కాలాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి మూడ్ బాలు నాయక్, కిషన్ నాయక్, మిధాని తండా అధ్యక్షులు వెంకట్రామ్, రవి, శంకర్, బాలు, లక్ష్మణ్, ఎం బాలు, లాల్య, దేశ్యా, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES