నవతెలంగాణ-హైదరాబాద్: యూపీ ఉన్నావ్ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడు జీవితఖైదు అనుభవిస్తున్న కుల్దిప్ సింగ్ సెంగర్కు ఢిల్లీ హైకోర్టు మంగళవారం జైలు శిక్షను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం సెంగర్కు బెయిల్ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సెంగర్ బాధితురాలి ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించకూడదని హైకోర్టు ఆదేశించింది. షరతుల్ని ఉల్లంఘించినట్లయితే బెయిల్ రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసిది. అత్యాచార కేసులో సెంగర్ను దోషిగా తేల్చి శిక్ష విధించడం జరిగింది. ఆయన ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీలు పెండింగ్లో ఉండేవరకు అతని శిక్షను హైకోర్టు నిలిపివేసింది. డిసెంబర్ 2019లో ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాల్ చేశారు.
కాగా, 2017లో సెంగర్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈయన బిజెపి నేత కూడా. ఈ కేసును ఆగస్టు 1 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, దానికి సంబంధించిన ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలి చేశారు. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో సెంగర్ను దోషిగా తేలడానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్ కూడా పెండింగ్లో ఉంది. తాను ఇప్పటికే చాలా కాలం నుంచి జైలులో గడిపినందున శిక్షను నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. ఇక కస్టోడియల్ డెత్ కేసులో అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.



